అక్షరాస్యత, స్వశక్తి ద్వారానే ఆర్థికాభివృద్ధి | Economic development through literacy says Justice Devanand | Sakshi
Sakshi News home page

అక్షరాస్యత, స్వశక్తి ద్వారానే ఆర్థికాభివృద్ధి

Jan 3 2022 4:46 AM | Updated on Jan 3 2022 4:46 AM

Economic development through literacy says Justice Devanand - Sakshi

జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న జస్టిస్‌ దేవానంద్‌

పెదకాకాని (పొన్నూరు):  అక్షరాస్యత, స్వశక్తిపై జీవనం సాగించేలా ప్రోత్సహించడంపైనే ప్రజల ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని విలేజ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆర్గనైజేషన్‌ (వీఆర్‌వో) ప్రాంగణంలో ప్రొఫెసర్‌ ఎంఏ విన్‌డ్లీ లీగల్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్‌ దేవానంద్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దురదృష్టవశాత్తు పలు విధానాల వల్ల పేదలు ఎటువంటి పరిపుష్టి సాధించకుండా పేదలుగానే మిగిలిపోయారన్నారు.

న్యాయ సహాయం కోసం పేదలు ఇప్పటికీ ప్రాధేయపడటం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. వీఆర్‌వో సంస్థ ఆధ్వర్యంలో స్థాపిస్తున్న లీగల్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా వాస్తవ లబ్ధిదారులకు అవసరమైన న్యాయ సహాయం ఉచితంగా అందాలన్నారు. తొలుత జస్టిస్‌ బట్టు దేవానంద్‌ చేతుల మీదుగా శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన జరిగాయి. ఈ కార్యక్రమంలో వీఆర్‌వో సంస్థ గ్రామ శాఖ ప్రెసిడెంట్‌ సిస్టర్‌ క్లీటస్‌డైసీ, సెక్రటరీ ఫాదర్‌ ధన్‌పాల్, విశ్రాంత ఐఏఎస్, గవర్నింగ్‌ బోర్డు సభ్యుడు డాక్టర్‌ టి.గోపాలరావు, నందిగామ సివిల్‌ జ్యుడిషియల్‌ జడ్జి జేసురత్నం, సంస్థ ట్రెజరర్‌ కవితా డేవిడ్, బాలస్వామి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement