తొమ్మిది జిల్లాలకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ హోదా | Digital banking status for nine districts | Sakshi
Sakshi News home page

తొమ్మిది జిల్లాలకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ హోదా

Apr 11 2023 5:03 AM | Updated on Apr 11 2023 5:03 AM

Digital banking status for nine districts - Sakshi

సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటికే తొమ్మిదింటిని 100 శాతం డిజిటల్‌ జిల్లాలుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తించింది. మరో 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చే ప్రక్రియను మొదలు పెట్టింది. ఒక జిల్లాలో బ్యాంకు ఖాతాలు కలిగిన వారంతా డెబిట్‌ కార్డు లేదా ఫోన్, నెట్‌ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకటి వినియోగిస్తుంటే ఆ జిల్లాను డిజిటల్‌ జిల్లాగా గుర్తిస్తారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఈ ప్రాజెక్టును చేపట్టగా రాష్ట్రంలో తొలి డిజిటల్‌ జిల్లాగా వైఎస్సార్‌ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు దశల్లో వైఎస్సార్, గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల, పల్నాడు, తూ­ర్పుగోదావరి జిల్లాలు డిజిటల్‌ జిల్లాలుగా మారాయి. ఇప్పుడు నాలుగో దశలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.

కాగా రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు 100 శాతం డిజిటల్‌ బ్యాంకింగ్‌ జిల్లాలుగా మారడంపై సీఎం వైఎస్‌ జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి కృషి చేయాలని బ్యాంకింగ్‌ వర్గాలను కోరారు. విద్యార్థి దశ నుంచే బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై అవగాహన కల్పిం చడానికి పాఠశాలల సిలబస్‌లో ఆరి్థక సేవలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారని ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వికాస్‌ జైస్వాల్‌ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,12,419 బ్యాంకింగ్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా ఆర్థి క సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7,769 బ్యాంక్‌ బ్రాంచ్‌లు కాగా బిజినెస్‌ కరస్పాండెంట్లు 94,097, ఏటీఎంలు 10,553 ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను డిజిటల్‌ జిల్లాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement