దళిత సర్పంచ్‌కు అవమానం | Dalit Sarpanch insulted in Kurnool district | Sakshi
Sakshi News home page

దళిత సర్పంచ్‌కు అవమానం

Jun 19 2025 4:41 AM | Updated on Jun 19 2025 4:41 AM

Dalit Sarpanch insulted in Kurnool district

వేదిక కిందనే కాళ్ల దగ్గర నిలుచుని ఉండిపోయిన దళిత సర్పంచ్‌ చంద్రశేఖర్‌

టీడీపీ, బీజేపీ నేతల దురహంకారం   

కర్నూలు జిల్లా డాణాపురంలో దళిత సర్పంచ్‌ను కాళ్ల దగ్గర 

నిల్చోబెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు క్రిష్ణమ్మ 

ఎస్సీ కావడంతో వేదికపైకి వద్దన్న క్రిష్ణమ్మ 

కాళ్ల దగ్గర నిలబడాలని సూచించిన ఎమ్మెల్యే పార్థసారథి  

టీడీపీ, బీజేపీ నేతల తీరుపై ప్రజా సంఘాల మండిపాటు

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు జిల్లా ఆదోని మండలం డాణాపురంలో దళిత సర్పంచ్‌ చంద్రశేఖర్‌కు తీవ్ర అవమానం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ ఆయన్ను ఎస్సీ అని సంబోధించి వేదికపైన చోటివ్వలేదు. పైగా వారి కాళ్ల దగ్గర నిల్చోవాలని సూచించడం తీవ్ర దుమారం రేపుతోంది. సర్పంచ్‌ ఎస్సీ కావడంతోనే వేదిక కిందనే నిలబెట్టి బీజేపీ, టీడీపీ నేతలు అవమానించారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు  నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

సోషల్‌ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి..
కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తిచేసిన సందర్భంగా ఆదోని మండలం డాణాపురంలో గుడికట్టపై ఈనెల 16న  ‘ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో  ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే.. సర్పంచ్‌ ఎక్కడంటూ పిలిచారు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిష్టియనా; అని ఎమ్మెల్యే అనగా.. అక్కడే ఉన్న గుడిసె క్రిష్ణమ్మ ఆయన చెవిలో ఎస్సీ అని చెప్పింది. 

అందుకు ఆయన అవునా అంటుండగా అప్పటికే సర్పంచ్‌ చంద్రశేఖర్‌ స్టేజి దగ్గరకు వచ్చారు. దీంతో వారి కాళ్ల దగ్గర నిల్చోవాలని ఎమ్మెల్యే సూచించారు.  గ్రామాల్లో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తే సర్పంచ్‌ అధ్యక్షతన వహించాల్సి ఉన్నా ఆ విషయాన్ని టీడీపీ, బీజేపీ నేతలు విస్మరించి దళిత సర్పంచ్‌ను అవమానించారు. తరువాత స్టేజీపైకి పిలిచినట్లు పిలిచి వారి కాళ్ల దగ్గర నిల్చోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో ఆలస్యంగా వైరలైంది. 

ఇదిలా ఉంటే చంద్రశేఖర్‌ వైఎస్సార్‌సీపీ తరపున సర్పంచ్‌గా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే ఉండి కూడా ఆ పార్టీ సర్పంచ్‌ను ఎస్సీ అంటూ తీవ్రంగా అవమానించారు.  గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కే ఇలా జరిగితే ఇక మిగిలిన ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  

క్రిష్ణమ్మ, పార్థసారథిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఆదోని మండలం డాణాపురం సర్పంచ్‌ చంద్రశేఖర్‌కు జరిగిన అవమానంపై కుల వివక్ష వ్యతిరేక పోరాటసవిుతి(కేవీపీఎస్‌), డీవైఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తంచేశాయి.  ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయా సంఘాల జిల్లా కార్యదర్శులు ఎండీ ఆనంద్‌బాబు, వై.నగేష్‌ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు.  సభకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్‌ను మధ్యలో పిలిచి అవమానించడమేమిటని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ కుల దురహంకారానికి ఈ ఘటన నిదర్శనమని ధ్వజమెత్తారు.  

నన్ను అవమానించారు
మా గ్రామస్తుల మధ్య టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ తనను ఎస్సీ అని, గుడి కట్ట ఎక్కరాదని ఎమ్మెల్యేకు చెవిలో చెబుతూ అవమానపరచడం వాస్తవం. కానీ ఆమె ఎందుకు అలా వ్యవహరించారో ఆమె విజ్ఞతకే వదిలేస్తా. నేను వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌గా గె­లుపొందా. మా గ్రామంలోని కొంతమంది నాయకులతో సరిపడక బీజేపీలోకి వెళ్లాను. ఇక్కడ జరిగిన అవమానం నన్ను కలచివేస్తోంది.– చంద్రశేఖర్, డాణాపురం సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement