
విశాఖ : సింహాచలం దుర్ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ కొనసాగుతున్న సందర్భంలో వారిని సీపీఎం నేతలు కలిశారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం నేతలు కోరారు. ఈ దర్యాప్తు అనేది ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జరగాలన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘అ‘ సింహాచలం గోడ కూలిన దుర్ఘటనలో మరణనించిన వారికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబ సభ్యులకు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
క్షతగాత్రులకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి. రక్షణగా ఉండాల్సిన గోడే భక్తులను భక్షించింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ కూడా బాధ్యత వహించాలి. మంత్రుల కమిటీ పనుల తనికీల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. అధికారులు, కాంట్రాక్టర్ను ఒక్కరినే బలి చేయడం కాదు అసలైన బాధ్యులైన గుర్తించాలి. గోడ నాశిరకంగా కట్టారు.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.’ అని వారు విమర్శించారు.
కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.