కార్పొరేటు తగ్గదండీ | Corporate managements have opened the door to fee exploitation | Sakshi
Sakshi News home page

కార్పొరేటు తగ్గదండీ

Apr 12 2025 5:19 AM | Updated on Apr 12 2025 5:19 AM

Corporate managements have opened the door to fee exploitation

ఇంటర్‌లో కోర్సును బట్టి ఫీజులు

అడ్మిషన్‌ కావాలంటే 50 శాతాన్ని చెల్లించాల్సిందే 

కొత్త పేర్లు పెట్టి నయా దోపిడీ 

పుస్తకాలకు అదనంగా వసూళ్లు 

ఎటూ తేల్చుకోలేకపోతున్న తల్లిదండ్రులు 

విద్యార్థి భవిష్యత్తుకు ఇంటర్‌ విద్య ఎంతో కీలకం. తమ పిల్లలు ఇందులో మంచి మార్కులు సాధిస్తే వారి భవితకు ఢోకా ఉండదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంటున్నారు. దీన్నే కార్పొరేట్‌ యాజమాన్యాలు చక్కగా క్యాష్‌ చేసుకుంటున్నాయి. ప్రథమ సంవత్సర అడ్మిషన్లు సోమవారం ప్రారంభం కావడంతో కోర్సులు, ఫీజులపై కళాశాలల ప్రతినిధులను సంప్రదిస్తుండగా, వారు చెప్పే రేట్లు విని గుడ్లు తేలేయడం పేరెంట్స్‌ వంతవుతోంది. 

నెల్లూరు(టౌన్‌): ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభయ్యాయో లేదో ఫీజుల దోపిడీకి కార్పొరేట్‌ యాజమాన్యాలు తెరలేపాయి. వాస్తవానికి ఇందులో ఎంపీసీ, బైపీసీ కోర్సులంటే యమ క్రేజ్‌. వీటికి రకరకాల పేర్లు తగిలించి ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నారు. డే స్కాలర్‌కు రూ.90 వేల నుంచి రూ.1.65 లక్షల వరకు.. అదే హాస్టల్‌ వసతి కూడా కలిపితే రూ.రెండు లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే వీరి ధనదాహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరికి అనుకూలంగానిర్ణయాలు తీసుకుంటూ, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేస్తోందనే ఆరోపణలూ లేకపోలేదు. 

నియంత్రణ.. డొల్ల 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 136 కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇందులో ఏటా 23 వేల మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు సోమవారం.. ద్వితీయ సంవత్సర తరగతులు ఈ నెల ఒకటిన షురూ అయ్యాయి. ఈ నెల 23 వరకు బ్రిడ్జి కోర్సులనే నిర్వహించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. 24 నుంచి జూన్‌ ఒకటి వరకు వేసవి సెలవులు.. మరుసటి రోజున కళాశాలలను పునఃప్రారంభించాలని ఆదేశించారు. 

అడ్మిషన్ల సమయంలో తాత్కాలిక ఫీజులనే వసూలు చేయాలనే ఆదేశాలు ఉన్నా, నియంత్రణ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. సిలబస్‌ను ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నామనీ చెప్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఎటూ తేల్చుకోలేని సందిగ్థంలో తల్లిదండ్రులున్నారు. 

సగం చెల్లిస్తేనే ఖరారు 
కోర్సు, బ్రాంచీలను బట్టి ఫీజులను నిర్ణయించారు. ఐఐటీ, నీట్, ఎంసెట్‌లో ర్యాంకులంటూ రకరకాల కోర్సులను ప్రవేశపెట్టారు. ఎంపీసీలో స్టార్‌ సూపర్‌ చైనా, సీఓ సూపర్‌ చైనా, ఎన్‌ 120, సీఓ స్పార్క్, స్పార్క్, నీట్‌ తదితర పేర్లను ఖరారు చేసి ఫీజులను నిర్ధారించారు. అడ్మిషన్‌ సమయంలో మొత్తం ఫీజులో 50 శాతాన్ని చెల్లిస్తేనే ఖరారవుతుందని యాజమాన్యాలు చెప్తున్నాయి. వేసవి సెలవులయ్యాక ఇప్పటి ఫీజు ఉండదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫీజులో రూ.10 వేల నుంచి రూ.15 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు.. 
ఇంటర్‌ బోర్డు అధికారులు సైతం కార్పొరేట్‌ యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజులను వసూలు చేస్తున్నా, వీటి వివరాలను నోటీస్‌ బోర్డుల్లో ప్రదర్శించకపోయినా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రికి సంబంధించిన విద్యాసంస్థలే అధికంగా ఉండటంతో అటు వైపు అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. 

మరోవైపు ఆయా కశాశాలలు నిర్వహిస్తున్న హాస్టళ్లకు ఎలాంటి అనుమతులూ ఉండవు. ఎంఈడీ చేసిన అధ్యాపకులు ఉండాల్సి ఉన్నా, డిగ్రీ, పీజీ వారితోనే బోధన చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. అంతంతమాత్రంగా మారిన వసతులతో పాటు భోజనం నాసిరకంగా ఉంటోందని విద్యార్థులే చెప్తున్నారు. ఇప్పటికైనా వీరి దోపిడీని అరికట్టేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫీజుల దోపిడీని అరికట్టాలి 
కార్పొరేట్‌ యాజమాన్యాల ఫీజు దోపిడీని అరికట్టాలి. లక్షల్లో వసూలు చేస్తున్నా, బోధన, వసతులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఇంటర్‌ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ 

ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి 
పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి. ధరల పట్టికను నోటీస్‌ బోర్డుల్లో ప్రదర్శించాల్సి ఉన్నా, ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.  – లీలామోహన్, రాష్ట్ర కార్యదర్శి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ 

నామినల్‌ ఫీజులనే వసూలు చేయాలి 
నామినల్‌ ఫీజులనే వసూలు చేయాలని యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌కు జూమ్‌ మీటింగ్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశాం. రెగ్యులర్‌ తరగతులను జూన్‌ రెండు నుంచి నిర్వహించాలి. ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులొస్తే చర్యలు చేపడతాం.  – ఆదూరు శ్రీనివాసులు, ఆర్‌ఐఓ  

Advertisement
 
Advertisement
Advertisement