కాంట్రాక్టు అధ్యాపకులకు ఎసరు | Contract teachers are expressing deep anger over the coalition government approach | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అధ్యాపకులకు ఎసరు

Jun 20 2025 3:45 AM | Updated on Jun 20 2025 3:45 AM

Contract teachers are expressing deep anger over the coalition government approach

వర్సిటీల్లోని పాత వారిని తొలగించేందుకు కూటమి సర్కార్‌ కుట్ర

తమకు నచ్చినవారిని నియమించుకునేందుకు ప్లాన్‌

దశాబ్దాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు కొత్తగా ఇంటర్వ్యూలు

శాశ్వత నియామకాల్లో ఏకంగా వెయిటేజీ ఎత్తివేత

అన్యాయాలపై గొంతు విప్పితే ఉద్యోగాలు పీకేస్తామంటూ హెచ్చరిక

నిబంధనలు మార్చి.. ఒప్పందాలపై సంతకాలు పెట్టాలంటూ హుకుం

కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉనికి ప్రమాదంలో పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని సైతం తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కాంట్రాక్టు అధ్యాపకులు, సిబ్బందిని రెన్యువల్‌ చేయడం ఆనవాయితీ. కానీ, కూటమి ప్రభుత్వం ఈసారి రెన్యువల్‌ చేయకుండా ఇంటర్వూ్యలకు హాజరుకావాలంటూ హుకుం జారీ చేసింది. తమకు నచ్చినవారిని వర్సిటీల్లో కూర్చోబెట్టేందుకు కాంట్రాక్టు ఉద్యోగులకు ఎసరు పెట్టింది. – సాక్షి, అమరావతి

ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమే..
రాష్ట్రంలో ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో దాదాపు 2,500 మంది అకడమిక్‌ కన్సల్టెంట్లు/అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 2వేల మందికి పైగా పీహెచ్‌డీలు చేసి.. రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వర్సిటీల్లో 700 నుంచి 800 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉన్నారు. ఏటా 50 నుంచి 100 మంది వరకు రిటైర్‌ అవుతున్నారు. ఈ తరుణంలో శాశ్వత నియామకాలు చేపట్టాల్సిన కూటమి ప్రభుత్వం.. కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల మెడపై కత్తి పెట్టింది. 

వర్సిటీల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి.. వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. ఇది చాలదన్నట్టు.. కాంట్రాక్టు ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా మార్చేసి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఏదైనా సమస్య వస్తే కోర్టును ఆశ్రయించడానికి వీల్లేకుండా నిబంధనలు తెచ్చింది. ఇది పూర్తిగా హక్కులను కాలరాయడమేనని విద్యావేత్తలు మండిపడుతున్నారు. 

కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుంచి ఏ క్షణమైనా తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. జేఎన్‌టీయూ(అనంతపురం)లో రెండు రోజుల కిందట కొత్త నిబంధనలను తీసుకొచ్చి.. సంతకాలు పెట్టాలంటూ కాంట్రాక్టు అధ్యాపకులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. 

శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఎత్తివేత..
చంద్రబాబు హయాంలో వర్సిటీల్లో ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాల ఊసే వినిపించదు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి.. కోర్టుల్లో కేసులు వేయించి.. వాటిని ఆపించిన చరిత్ర చంద్రబాబుది. 2017లోనూ ఇదే విధంగా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ వర్సిటీల బలోపేతానికి కృషి చేశారు. 2023లో కోర్టు కేసులను పరిష్కరించి 3,220 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్‌ కో మళ్లీ కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. అయినా శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టలేదు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వర్సిటీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్టు అధ్యాపకుడికి సర్వీసు ప్రకారం ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులను వెయిటేజ్‌ కింద ప్రకటించింది. ఇంటర్వ్యూ మార్కుల్లోనూ వెసులుబాటు కల్పించింది. కానీ, కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును రెగ్యులర్‌ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement