
ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణకు కుట్ర
శ్రమదోపిడీకి సర్కారు ఆస్కారం!
20 మంది కార్మికులు ఉండే సంస్థలను కార్మిక శాఖ పరిధి నుంచి తొలగించే యోచన
తనిఖీ అధికారాలకు కత్తెర
30 లక్షలకుపైగా శ్రామికులపై ప్రభావం
బాబు సర్కారుపై కార్మికలోకం ఆగ్రహం
ఇప్పటికే పని వేళలు 10 గంటలకు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, అమరావతి: శ్రమ దోపిడీకి ఆస్కారం ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాసేందుకు కూటమి సర్కారు కుట్రపన్నుతోంది. ఇప్పటికే పని వేళలను పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న కర్కశ ప్రభుత్వం ఇప్పుడు చిన్న సంస్థల్లో పనిచేసే చిరుజీవుల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
చిన్న వాణిజ్య సంస్థల్లో పనిచేసే గుమాస్తాలు, వాచ్మెన్లు, ఇతర చిరుద్యోగుల హక్కులు కాపాడే ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టాన్ని సవరించేందుకు సిద్ధమైంది. 20 మందిలోపు సిబ్బంది ఉండే సంస్థలపై కార్మిక శాఖ జోక్యం లేకుండా చట్ట సవరణకు ప్రతిపాదనలు చేసింది. ఇవి వచ్చే కేబినెట్ భేటీలో మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
యజమానే డిక్లరేషన్ ఇస్తే చాలట
రాష్ట్రంలో ఒకటి నుంచి 20 మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు 3.50 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిల్లో 30 లక్షల మంది కార్మికులు, చిరుద్యోగులు పనిచేస్తుంటారు. ఈ సంస్థలు ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–1988 మార్గదర్శకాలు పాటించాలి. ఈ చట్టం ప్రకారం.. ఎప్పటికప్పుడు కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై కేసుల నమోదుకు అవకాశం ఉంటుంది.
అయితే 20 మంది లోపు సిబ్బందితో నడిచే సంస్థలను కార్మిక శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిప్రకారం.. అన్ని నిబంధనలూ సక్రమంగా పాటిస్తున్నామని యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు.. ఆ సంస్థలలో కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేయడానికి అవకాశం ఉండదు.
దాదాపు 12 గంటలు పనిచేయిస్తున్న సంస్థలు
ఇప్పటికే చిన్న సంస్థల యజమానులు శ్రామికుల చేత 12 గంటలకుపైగా పనిచేయిస్తున్నారు. ఉదయం పది గంటలకు దుకాణానికి వెళితే రాత్రి పదిగంటల తర్వాత కూడా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. కార్మిక శాఖ ఏడాది పొడవునా ఈ దుకాణాలను తనిఖీ చేసి నియంత్రిస్తున్నా.. యజమానులు లెక్కచేయని దుస్థితి. ఇప్పుడు ప్రభుత్వమే కార్మిక శాఖ పరిధి నుంచి వాటిని మినహాయిస్తే ఇప్పుడు పరిస్థితి ఇంకా ఎంత భయానకంగా ఉంటుందోనని శ్రామికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే పని గంటలు పెంపు
ఓ వైపు పని వేళలు తగ్గించాలని కార్మిక వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంటే దీనికి భిన్నంగా పెట్టుబడుల ఆకర్షణను సాకుగా చూపి పని వేళలను గరిష్టంగా 9 నుంచి 10 గంటలకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్రైమాసిక కాలానికి ఓవర్ టైమ్ 75 గంటల నుంచి 144 గంటలకు పెరిగాయి. ఈ పెంపు వల్ల ఎక్కువ సంపాదించవచ్చని సర్కారు వక్రభాష్యం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస వేతనాలే అమలు కావడం లేదన్న సత్యాన్ని ఉద్దేశపూర్వంగా విస్మరిస్తోంది.
ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ యాక్ట్– 1988 చట్టం ఏం చెబుతోందంటే..
» ఒక వర్కర్ను సంస్థలో చేర్చుకునేప్పుడు నియామక పత్రం ఇవ్వాలి.
» ఉద్యోగి అటెండెన్స్ రిజిçష్ట్టర్ను నిర్వహించాలి. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతనం చెల్లించాలి.
» ఏటా 12 రోజులు క్యాజువల్ లీవ్స్, 9 పండుగ సెలవులు ఇవ్వాలి. వీక్లీ ఆఫ్ అమలు చేయాలి.
» వర్కర్కు మధ్యలో డబ్బు అవసరం అయితే ఇవ్వడానికి వీలుగా అడ్వాన్స్ రిజిస్టర్ పెట్టాలి.
» ఉద్యోగంలో నుంచి తీసి వేయడానికి నెల ముందు నోటీస్ ఇవ్వాలి.
» 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్టయితే నెల వేతనం ఏటా బోనస్ కింద ఇవ్వాలి. కనీస వేతనాల చట్టం అమలు, స్త్రీ, పురుషులకు సమాన వేతనం పాటించాలి.
» కార్మిక శాఖ సాధారణ తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జి షీట్ దాఖలు చేయడానికి వీలుంటుంది. కనీస వేతనాలు ఇవ్వలేదని తేలితే యజమాని నుంచి రికవరీ చేయచ్చు.
చట్ట సవరణ చేస్తే..
» చట్ట సవరణ అయితే ఎవరైనా శ్రామికుడు ఫిర్యాదు చేస్తే తప్ప కార్మిక శాఖ చిన్న సంస్థలపై జోక్యం చేసుకోరాదు. దీనివల్ల ఇప్పుడు ఉన్న హక్కులన్నింటినీ కార్మికుడు కోల్పోయే ప్రమాదం ఉంది. యజమాని సెల్ఫ్ డిక్లరేషన్లో అసత్యాలు పేర్కొనే ఆస్కారమూ ఉంది.