సినీ రంగానికి తీరని లోటు
కళాతపస్వి మృతిపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మహాభినిష్క్రమణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ దర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపు తీసుకొచ్చారన్నారు.
ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని చెప్పారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ పేరుపై రాష్ట్ర ప్రభుత్వం లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డును విశ్వనాథ్కి ఇచ్చిన అంశాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.