విద్యుత్‌ కొరత రాకూడదు 

CM YS Jagan order in review of Energy Department Andhra Pradesh - Sakshi

అధికారులు అన్ని విధాలుగా సిద్ధం కావాలి 

బొగ్గు నిల్వలపై జాగ్రత్త వహించాలి 

రైతులకు కనెక్షన్ల మంజూరులో జాప్యం జరగకూడదు 

ఇంధన శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం 

ఈనెల 2వ వారం నుంచే పెరిగిన డిమాండ్‌.. అందుకు తగ్గట్టుగా సమాయత్తం అవుతామన్న అధికారులు 

మార్చి, ఏప్రిల్‌లో సగటున రోజుకు 240–250 మిలియన్‌ యూనిట్లు అంచనా 

ఇప్పటికే పవర్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో ముందస్తుగా బుకింగ్‌  

జగనన్న కాలనీల్లో ఇప్పటికే 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు  

సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్‌ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావా­లని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్‌ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు.

విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్‌ ఎక్స్చ్‌ంజ్‌ (బహిరంగ మార్కెట్‌)లో విద్యుత్‌ను షార్ట్‌ టర్మ్‌ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్‌ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. 
 
అదే నెలలో విద్యుత్‌ కనెక్షన్‌  
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు.

రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. 
 
సరఫరాలో నాణ్యత 
విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు.

పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు.

ఈ సమావేశంలో విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్‌క్యాప్‌ వీసీఎండీ ఎస్‌.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top