CM Jagan Kurnool Tour: కర్నూలు జిల్లా పర్యటనకు సీఎం జగన్‌

CM YS Jagan Kurnool District Tour on 16th April - Sakshi

సాక్షి, కర్నూలు(సెంట్రల్‌): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16న కర్నూలుకు వస్తున్నట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌రెడ్డి కుమారుడు వివాహానికి హాజరవుతారని చెప్పారు. అయితే పెళ్లి 17వ తేదీ కాగా, 16న సీఎం కర్నూలు చేరుకుని కృష్ణానగర్‌లో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో వధూవరులను ఆశీర్వదిస్తారన్నారు. సీఎం పర్యటనపై మంగళవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో  జిల్లా అధికారులు, పోలీసులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా బెటాలియన్‌ చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కృష్ణానగర్‌లోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం ఉందన్నారు.

చదవండి: (దేవుడా...జేసీకి మంచి బుద్ధి ప్రసాదించు!) 

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, చిత్రంలో జేసీ రామసుందర్‌రెడ్డి

ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా శానిటేషన్‌ చేపట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌తేజ్‌ను ఆదేశించారు. సీఎం కాన్వాయ్‌ వాహనాలను ఏర్పాటు చేయాలని డీటీసీని, సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హెలిపాడ్, ఎమ్మెల్యే నివాసం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక వాహనాలను సమకూర్చాలని సూచించారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎవరైనా అలసత్వం వహిస్తే వేటు తప్పదని అధికారులను హెచ్చరించారు. సమీక్షలో జేసీ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, డీఆర్‌ఓ ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

సీఎం పర్యటన ఇలా.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. 16వ తేదీ ఉదయం 10.40 నుంచి 01.05 గంటల మధ్య కర్నూలులో పర్యటిస్తారు.   
10.40 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
10.50 గంటలకు హెలికాప్టర్‌లో కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లోని హెలిపాడ్‌కు 
చేరుకుంటారు.  
11.10 గంటలకు కర్నూలులోని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటికి రోడ్డు మార్గంలో బయలు దేరుతారు. 
11.20 గటంలకు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని 11.35 వరకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. 
11.45 గంటలకు ఏపీఎస్‌పీ బెటాలియన్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు. 
12.05 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుని గన్నవరానికి విమానంలో వెళ్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top