మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి  | CM Jagan directed the authorities to pay Special focus on women safety | Sakshi
Sakshi News home page

మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి 

Jun 24 2021 3:27 AM | Updated on Jun 24 2021 9:41 AM

CM Jagan directed the authorities to pay Special focus on women safety - Sakshi

క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు దిశ యాప్‌పై పూర్తి అవగాహన,  చైతన్యం కలిగించాలని సూచించారు. దిశ యాప్‌ను ఎలా వాడాలన్న దానిపై అవగాహన కలిగించాలని అధికారులకు  స్పష్టం చేశారు. మహిళా భద్రత, దిశ యాప్‌ వినియోగంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో  హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంవో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి అక్క చెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వలంటీర్లకు తొలుత శిక్షణ ఇచ్చి, తర్వాత వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కలిగించాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే విషయంపై అక్క చెల్లెమ్మలకు విడమరచి చెప్పాలన్నారు. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాలేజీలు, విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కలిగించాలని, ఈ చర్యతో  దిశ యాప్‌ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు.

అక్క చెల్లెమ్మలకు మరింత భద్రత కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. దిశ, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలని, పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement