CM YS Jagan: దశాబ్దాల ప్రశ్నలకు మూడేళ్లలో జవాబిచ్చాం

CM Jagan Comments At Independence Day Celebrations Vijayawada - Sakshi

మహనీయుల స్ఫూర్తితో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు: సీఎం జగన్‌

21వ శతాబ్దపు ఆధునిక మహిళ ఏపీ నుంచే ఆవిర్భవించేలా సాధికారత.. మూడేళ్లలో 6.03 లక్షల మందికి ఉద్యోగాల కల్పన

అన్నదాతలకు రూ.1.27 లక్షల కోట్ల మేర లబ్ధి

విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు

గడప వద్దకే పౌరసేవలన్నీ

ఆహార ధాన్యాల దిగుబడి ఏటా 16 లక్షల టన్నులు పెరుగుదల.. నాలుగు దశాబ్దాల తర్వాత కొత్తగా 4 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లు

ఎంఎస్‌ఎంఈల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి

ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు త్వరలో 3,133కి పెంపు

రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచ్యురేషన్‌ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు కాబట్టే లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. దేశ చరిత్రలో పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

జెండా.. భారతీయుల గుండె
‘‘ఈ జెండా కేవలం దారాల కలనేత కాదు.. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, దేశభక్తికి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి, మనకు మన దేశంపై ఉన్న నిబద్ధతకు, ఈ దేశ భవిష్యత్తుకు ఉండాల్సిన చిత్తశుద్ధికి ప్రతీక. మన తెలుగువాడు పింగళి వెంకయ్య తయారు చేసిన ఈ జెండా.. ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె’’. 

స్వతంత్రానికి నిజమైన అర్థం
‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచురేషన్‌ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు. కాబట్టే ఎటువంటి లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది’’. 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
                
సంక్షేమమే మానవ అభివృద్ధి
‘‘సంక్షేమ పథకాలను మానవ వనరులపై పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయినీ కుటుంబాలను నిలబెట్టే, పేదరికం సంకెళ్లను తెంచే సాధనంగా పేదల చేతిలో ఉంచాం. ప్రతి పథకాన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డీజీ) సాధించేలా అమలు చేస్తున్నాం’’. 
–వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఒకవైపు ఉంటే.. మరోవైపు ఇదే గడ్డపై సమ సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు, మహిళా సాధికారత, మనుషులుగా గుర్తింపు, దోపిడీకి గురికాకుండా జీవించే రక్షణల కోసం జరుగుతున్న పోరాటాలకు వందల, వేల ఏళ్ల చరిత్ర ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవన్నీ పరాయి దేశంపై చేసిన స్వాతంత్య్ర పోరాటాలు కావని, మన సమాజంలో జరుగుతున్న సామాజిక స్వాతంత్య్ర పోరాటాలని ఆయన చెప్పారు. ఏడు దశాబ్దాల్లో స్వతంత్ర దేశంగా భారత్‌ తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకున్నప్పటికీ ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు. వీటికి లభించిన సమాధానాల ప్రతీకే.. ఈ మూడేళ్ల రాష్ట్ర ప్రభుత్వ పాలనగా స్పష్టం చేశారు.

రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ ఏ ఒక్క ప్రభుత్వంలోనూ కనిపించనంతటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విద్యా న్యాయాలను ప్రజలందరి ప్రభుత్వంలో చేసి చూపించామన్నారు. ఇంతటి విప్లవాత్మక మార్పులు ఒకరిద్దరు వ్యక్తులకో, కొంత మందికి ప్రయోజనం కల్పించేందుకు చేసినవి కావని.. ఇవన్నీ వ్యవస్థనే మార్చే మార్పులని ఉద్ఘాటించారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయ, విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాన్ని, సామాజిక వర్గాలకు అందే రాజకీయ అధికారాన్ని నిర్ణయించే విధంగా ఉంటాయన్నారు. మహిళల అభివృద్ధి ప్రాధాన్యంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు.

రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే తమ విధానమని, ప్రాంతాల ఆకాంక్షలు, ప్రాంతీయ ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి వికేంద్రీకరణే పునాదిగా నమ్ముతున్నామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవీ..

మతసామరస్యానికి ప్రతీక
నేడు ఎగిరిన ఈ జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఇది దేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక. భారతదేశపు ఆత్మకు, మనందరి ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ దేశం హిందూ, ఇస్లాం, క్రైస్తవం వంటి అనేక మతాలు, అనేక ధర్మాల సమ్మేళనం అని ఆ జెండా చెబుతుంది. మన జెండా మన సమరయోధుల త్యాగనిరతికి, మనం కోరుకునే సుస్థిర శాంతికి, ఈ దేశం పైరుపచ్చలతో కళకళలాడాలన్న భావనకు ప్రతీక. ఈ జెండా.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గొప్పదనానికి ప్రతీక. 
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం సతీమణి వైఎస్‌ భారతి 

మన పోరాటం మహోన్నతం
మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతం. ఈ ఏడాది మనం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సంపూర్ణం చేసుకుంటున్న సమయం. ఒక జాతి యావత్తు పోరాడుతున్నా.. అంతటి పోరాటంలో కూడా చెక్కుచెదరని అత్యున్నత మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం మన స్వాతంత్య్ర పోరాటం. ఇందులో వర్గాలు వేరైనా.. వాదాలు వేరైనా.. అతివాదమైనా, మితవాదమైనా, విప్లవ వాదమైనా.. గమ్యం ఒక్కటే, అది స్వతంత్రమే. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం... ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు మొత్తంగా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా, తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుంది. 

సంకల్ప విప్లవ సంగ్రామం
స్వాతంత్య్రం నా జన్మహక్కు.. దాన్ని సాధించి తీరుతానన్న బాలగంగాధర తిలక్‌ సంకల్పానికి, ఏకంగా ప్రవాస ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసి బ్రిటిష్‌ వారిపై యుద్ధం ప్రకటించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ అధినేత సుభాస్‌ చంద్రబోస్‌ సాహసానికి, జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండకు బాధ్యుడైన జనరల్‌ డయ్యర్‌ను లండన్‌ నడివీధుల్లో శిక్షించిన ఉధంసింగ్‌ తెగువకు, దేశం కోసం ఉరికంబం ఎక్కిన సర్దార్‌ భగత్‌సింగ్‌ త్యాగానికి ప్రతీక మన స్వతంత్ర పోరాటం.

జన సమూహాలే ఆయుధాలుగా..
మన సామాన్యుడి దేహం మీద వేసుకోడానికి నూలు పోగులు లేకున్నా.. మా దేశం మీద మీరు దేవతా వస్త్రాలు కప్పాం అంటే కుదరదన్న భావాలకు నిలువెత్తు రూపం గాంధీజీ. అణువణువూ స్వాతంత్య్ర కాంక్ష నిండిన జన సమూహాలే ఆయుధాలని.. అవి అణ్వాయుధాల కంటే శక్తిమంతమని నిరూపించిన మహాత్ముడు మన గాంధీజీ. 

మహాయోధుల త్యాగాలు, రక్తంతో తడిసిన పుణ్యభూమి 
భారతీయతకు ప్రతినిధులుగా నిలిచిన  ఒక మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, ఒక ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ఖాన్, సైమన్‌ కమిషన్‌ రాక సందర్భంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం, మన్నెం వీరుడిగా ప్రాణాలే అర్పించిన అల్లూరి..  ఇలా వందలు వేల మహాయోధుల త్యాగాలు, భావాలతో, వారి స్వేదంతో–రక్తంతో తడిసి ఈ పుణ్యభూమి పునీతమయింది. ఆ పునాదులమీదే స్వతంత్ర దేశంగా ఇండియా అవతరించింది.

వంద కోట్ల జెండాలు ఎగురుతున్నాయి
1857లో తొలి స్వతంత్ర సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటు జరిగితే, 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ పుట్టిన నాటి నుంచి 1947లో దేశ స్వాతంత్య్రం వరకు 62 సంవత్సరాల కాలం జాతీయోద్యమం, స్వాతంత్య్ర పోరాటం జరిగింది. అంటే తొలి స్వాతంత్య్ర పోరాటానికి, ఆ తరవాత– మితవాద, అతివాద, విప్లవ వాద సమరాలకు 90 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన ఎర్రకోటమీద మన పాలనలో మన తొలి జెండా ఎగిరింది. నేడు 75 ఏళ్ల తర్వాత ఈ రోజున.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 100 కోట్ల జెండాలు ఎగురుతున్నాయి. మానవ చరిత్రలోనే మహోన్నతమైన స్వతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ దేశం ఈ రోజున ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని జరుపుకుంటోంది.

తిరుగులేని విజయాల భారత్‌
గత 75 ఏళ్లలో దేశంగా ఇండియా తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన జనాభా కేవలం 35 కోట్లు అయితే ఈ రోజున అది మరో 106 కోట్లు పెరిగి ఏకంగా 141 కోట్లకు చేరింది. ఇంత అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి కావాల్సిన ఆహారం, నీరు, దుస్తులు, విద్య, వైద్యం, పరిశ్రమ, సేవలు ఇలా ఏది తీసుకున్నా తయారు చేయటం, అందించటం, మిగతా ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధించటం.. ఇవన్నీ అతి పెద్ద సవాళ్లే.

రైతన్నలకు దేశం సెల్యూట్‌ చేయాలి
మన దేశంలో 1947లో అప్పుడున్న 35 కోట్ల ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు లేని దుస్థితి. దాన్ని అధిగమించి.. ఈ రోజు ప్రపంచంలో ఏకంగా 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగల పరిస్థితిని తీసుకొచ్చిన మన రైతన్నలకు మన దేశమంతా సెల్యూట్‌ చేయాలి.  ఒకప్పుడు పీఎల్‌ 480 స్కీమ్‌ కింద గోధుమ నూకను మానవతా సహాయంగా అందుకున్న మన దేశం.. ఈ రోజున ఏకంగా ఏటా 70 లక్షల టన్నుల గోధుమను, ఏడాదికి 210 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి కేవలం 18 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయాలుంటే ఇప్పుడు 49 శాతానికి పైగా భూమికి సాగునీరందుతోంది. 

అగ్ర దేశాలతో పోటీ
1947లో వంద మందికి కేవలం 12 శాతం అక్షరాస్యులు ఉంటే.. ఈ రోజున మన అక్షరాస్యత, తాజా సర్వేల ప్రకారం 77 శాతానికి పైగా ఉంది. స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానం మనది. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 99 శాతం ప్రజల ఇంటికి కరెంటు లేదు. ఈ రోజు... కరెంటు లేని ఇళ్లు.. దేశం మొత్తంలో కేవలం ఒక శాతం కంటే తక్కువే.  చిన్న జ్వరం తగ్గే మాత్ర కావాలన్నా అప్పట్లో అన్నీ దిగుమతి అయిన ట్యాబ్లెట్లే ఉంటే.. ఈ రోజు ప్రపంచ ఫార్మా రంగంలో ఇండియా టాప్‌ 3 దేశాల్లో ఒకటి. అమెరికాలో వాడుతున్న ప్రతి మూడు ట్యాబ్లెట్లలో ఒకటి, మనల్ని పాలించిన బ్రిటన్‌లో ప్రజలు వాడుతున్న ప్రతి నాలుగు ట్యాబ్లెట్లలో ఒకటి ఇండియా తయారు చేసిందే.

స్ఫూర్తిని నింపిన విజయాలు
అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘన విజయాలు, ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనేలా మన శాస్త్రవేత్తలు తయారు చేసిన శక్తిమంతమైన అణ్వాయుధాలు–క్షిపణులు, మన తేజస్‌ వంటి యుద్ధ విమానాల కొనుగోలుకు అమెరికా ఆసక్తి కనబరచటం మొదలు... ఎందరో ఇండియన్లు అమెరికన్‌ కంపెనీల సీఈవోలుగా ఎదగటం వరకు, అలాగే 190 సంవత్సరాలు మన దేశాన్ని తన చేతిలోకి తీసుకున్న బ్రిటన్‌కు.. ఒక భారతీయ సంతతి పౌరుడు ప్రధాని రేసులో నిలవటం, ఒక భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం వరకు ఇవన్నీ భారతీయులు గర్వించే అంశాలే.  ఇవన్నీ మనకు కొండంత స్ఫూర్తిని నింపే విజయాలే.
 జెండా వందనం చేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి 

నిండు మనసుతో దిద్దుబాట్లు
స్వతంత్ర దేశంగా ఇండియా, అంతర్జాతీయంగా భారతీయులు సాధించిన విజయాలకు కొదవ లేదన్నది ఎంత వాస్తవమో.. దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వాతంత్ర్యం వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్‌గా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేకమంది ప్రజల్లో నేటికీ ఉండిపోయిందన్నది కూడా అంతే వాస్తవం. దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల  చరిత్ర ఉంటే... వందలు, వేల ఏళ్లుగా ఎన్నో సంఘ సంస్కరణ, సమాన హక్కుల పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని అణచివేతల మీద తిరుగుబాట్లు.. ఇవన్నీ మనం మాట్లాడకపోయినా, మనం దాచేసినా దాగని సత్యాలు. ఇవన్నీ నిజానికి... మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు.  మాటలతో కాకుండా చేతలతో సమాధానాలు ఇవ్వాల్సిన అంశాలు. ఇలాంటి సమాధానాల అన్వేషణే ఆంధ్రప్రదేశ్‌లో మన మూడేళ్ల పాలన.

దశాబ్దాల ప్రశ్నలకు సమాధానం
ఆహారాన్ని పండించే రైతు అర్ధాకలితో ఉండటాన్ని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించటాన్ని, గవర్నమెంటు బడికి వెళ్లే పేదల పిల్లలు కేవలం తెలుగు మీడియంలోనే చదవక తప్పని పరిస్థితిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల్ని, వైద్యం ఖర్చు భరించలేక, అమ్ముకునేందుకు ఏమీలేక.. అప్పటికే అప్పులపాలై నిస్సహాయంగా చనిపోవటాన్ని, చదువులకు అయ్యే ఖర్చు భరించలేక పిల్లల్ని చదువులు మాన్పించి పనిలో పెట్టాల్సివస్తే తల్లి హృదయం తల్లడిల్లటాన్ని, ఎస్సీల్లో 36 శాతం, ఎస్టీల్లో 51 శాతం నేటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోవటాన్ని, కార్పొరేట్‌ విద్యా సంస్థలకోసం, అంతకంటే మెరుగైన టీచర్లు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలి పెట్టటాన్ని, మనలో సగం ఉన్న అక్కచెల్లెమ్మలకు, వారి వాటాగా సగం ఉద్యోగాలు, సగం పదవులు, చట్ట సభల్లో సగం స్థానాలు కేటాయించకపోవటాన్ని, కొన్ని సామాజిక వర్గాల వారికి అధికార పదవుల్లో, పరిపాలనలో ఏనాటికీ వాటా దక్కకపోవటాన్ని, సంపద కేంద్రీకరణ ధోరణులకు తోడుగా, అధికార కేంద్రాలన్నీ ఒకేచోట ఉండాలన్న వాదనల్ని, గ్రామాల్లో ప్రభుత్వ సేవల విస్తరణ చేయకుండా పల్లెల్ని, రైతుల్ని గాలికి వదిలేయటాన్ని, ప్రతి పనికీ లంచాలు, కమీషన్ల వ్యవస్థ ఏర్పడటాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు చేసిన నష్టాన్ని, ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ, మన స్వతంత్ర దేశంలో... మన దేశం వాడే, మన రాష్ట్రం వాడే. మన ప్రజలకు అన్యాయం చేస్తే... దాన్నే పరిపాలన అంటాడని... ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన మీడియా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని... మన స్వాతంత్య్ర సమర యోధులు, మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాల అనుభవాల నుంచి, ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాల నుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు.. మనందరి ప్రభుత్వంలో.. గత మూడేళ్ల పాలనతో సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా తెలుపుతున్నాను.

పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు
మన గ్రామానికి, మన నగరానికి అందే పౌరసేవల్లో మార్పులు తీసుకువచ్చాం. ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి మరీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.70 లక్షల మంది వలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి 2000 మందికి పౌర సేవలందించేలా గ్రామ/వార్డు సచివాలయం, అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు, మరో నాలుగు అడుగుల్లో కనిపించే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, ఇంకో నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఇంగ్లిష్‌ మీడియం స్కూల్, మరో నాలుగు అడుగుల దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణం కాబోతున్న డిజిటల్‌ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లిష్‌లో బోధించే ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్‌ స్కూళ్లు, ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకీ ఒక అధునాతన 104.. అందులో ఇద్దరు డాక్టర్లను పెట్టి వారిని విలేజ్‌ క్లినిక్‌తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌.. ఇవన్నీ గడచిన 75 ఏళ్లలో కాదు.. కేవలం ఈ మూడేళ్లలో మనం తీసుకొచ్చిన మార్పులు.

పరిపాలన వికేంద్రీకరణే మా విధానం
ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మెరుగుపరుçస్తూ..  గ్రామాలూ, నగరాల్లో మార్పులే కాక, గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం అని.. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఇదీ.. మూడేళ్లలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు.

వ్యవసాయానికి రూ.1.27 లక్షల కోట్ల సాయం
వైఎస్సార్‌ రైతు భరోసాతో ఏకంగా 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామస్థాయిలో తీసుకువచ్చి ఈ–క్రాప్‌ మొదలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో నష్టాన్ని ఆ సీజన్‌ ముగిసేలోగానే అంచనా వేసి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించటం, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు వంటివి అందిస్తూ మూడేళ్లలో రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమానికి మనం చేసిన ఖర్చు ఏకంగా రూ.83 వేల కోట్లు. ఇది కాకుండా ధాన్యం సేకరణకు మరో రూ. 44 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసి గిట్టుబాటు ధర కల్పించాం. మొత్తంగా మూడేళ్లలో ఏకంగా రూ. 1.27 లక్షల కోట్లను వ్యవసాయంపై ఖర్చు చేశాం. దీని ఫలితంగా అంతకుముందు ఐదేళ్ల పాలనతో పోలిస్తే మన మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 16 లక్షల టన్నులు పెరిగింది. ఇది మన ప్రభుత్వం వ్యవసాయంలో వేసిన ముందడుగు.

అక్కచెల్లెమ్మలకు రూ.2–3 లక్షల కోట్ల ఆస్తి
75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత మూడేళ్ల క్రితం శాచురేషన్‌ పద్ధతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఏకంగా 31 లక్షల కుటుంబాలకు అంటే దాదాపు 1.25 కోట్ల జనాభాకు సొంత ఇల్లు లేదని తేలింది. వీరందరికీ ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అది కూడా ఆ కుటుంబంలో అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్‌ చేశాం. ఇందులో 21 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షలు వేసుకుంటే.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న కానుక.

పిల్లల చదువులతో పేదల తలరాతల మార్పు 
పిల్లల చదువులతోనే ఇంటింటా పేదల తలరాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో, రూపం మార్చుకున్న అంటరానితనాన్ని తుదముట్టించాలన్న నిశ్చయంతో.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డివిరుస్తూ గవర్నమెంటు బడులన్నింటిలో ఇంగ్లి్ష్‌ మీడియంను అమలు చేయాలని నిర్ణయించాం. దీనితోపాటు పిల్లలను చదివించే తల్లులకు అండగా, తోడుగా నిలుస్తూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నాం. ఇవి కాకుండా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి–నాడు నేడు, సీబీఎస్‌ఈ సిలబస్, బైజూస్‌ సంస్థతో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఇన్ని పథకాలతో విద్యారంగంలో తీసుకు వస్తున్న ప్రతి మార్పు వెనకా మన రాష్ట్రంలోని పిల్లలందరి భవిష్యత్తుపై మనందరి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది. ఇందుకోసం మూడేళ్లలో విద్యారంగంపై ఏకంగా రూ. 53 వేల కోట్లకు పైనే వ్యయం చేశాం. 

95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీతో భరోసా
వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. రూ. వెయ్యి ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతోనే 2,434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వీటిని ఈ నెలలోగా 3,133కు పెంచుతున్నాం. ఆపరేషన్‌ తర్వాత రోగులు కోలుకునే సమయంలో వారికి దన్నుగా నెలకు రూ.5 వేలు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాగా ఇస్తున్నాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 108, 104 సేవలకు అర్థం చెపుతూ ఏకంగా 1,088 వాహనాల్ని  ప్రతి మండలానికీ పంపాం. 

వీటిని మరింతగా పెంచుతూ మరో 432 వాహనాలను పంపనున్నాం. గ్రామగ్రామానా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటితో పీహెచ్‌సీలు అనుసంధానమై గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు బీజం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉంటే, కొత్తగా మరో 16 వైద్య బోధనాస్పత్రులను నిర్మిస్తున్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు ఆసుపత్రుల రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని మార్చేస్తూ.. జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించటానికి వైద్య రంగంలో రూ.16వేల కోట్లతో నాడు–నేడు అమలు చేస్తున్నాం. ఈ ఒక్క రంగంలోనే అక్షరాలా 40 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. 

మూడేళ్లలో 6.03 లక్షల మందికి ఉద్యోగాలు
ఒకవైపు ప్రభుత్వ బడుల్ని, మరో వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్ని మెరుగుపరచడమే కాకుండా ఈ మూడేళ్లలోనే మొత్తంగా 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 1.84 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలతోపాటు, 20 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, 4 లక్షల  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు కల్పించాం. వీరంతా మన కళ్ల ఎదుటే గ్రామ/వార్డు సచివాలయాల్లో, గ్రామాల్లో వలంటీర్లుగా, ఆర్టీసీలో, మారుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపిస్తారు.

పారిశ్రామిక రంగానికి ఊతం
దాదాపు నాలుగు దశాబ్దాల తరవాత ప్రభుత్వ రంగంలో మరో నాలుగు సీ పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం. సువిశాల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కుదేలైన ఎంఎస్‌ఎంఈ రంగాన్ని నిలబెడుతూ 10లక్షల మంది ఉపాధికి భరోసానిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. 

ఏపీ నుంచే 21వ శతాబ్దపు ఆధునిక మహిళ
21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో దేశంలో ఏ ప్రభుత్వం వేయని అడుగులు వేస్తున్నాం. 44.5 లక్షల తల్లులకు, 85 లక్షల పిల్లలకు మంచి జరిగేలా మూడేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,618 కోట్లు, వైఎస్సార్‌ ఆసరా ద్వారా 78.74 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ. 12,758 కోట్లు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా కోటీ రెండు లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.3,615 కోట్లు అందించాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా 24.96 లక్షల మంది 45–60 మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రూ. 9,180 కోట్ల లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా మరో రూ. 1,492 కోట్లు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా రూ.589 కోట్లతో తోడ్పాటునందించాం. ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో, ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యంతో అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం.  

అక్కచెల్లెమ్మలకు దన్నుగా నిలిచాం
అక్కచెల్లెమ్మలకు ఆలయ బోర్డుల నుంచి వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల వరకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ, నామినేషన్‌ కాంట్రాక్టుల్లోను 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరీ అమలు చేసిన ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో మనం మాత్రమే. దిశ చట్టానికి రూప కల్పన, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రతి రెండు వేల జనాభాకూ గ్రామంలోనే ఒక మహిళా పోలీస్‌ నియామకం.. ఇవన్నీ మహిళా రక్షణపరంగా మనందరి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు.   

సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం
మొదటి విడత 56 శాతం, రెండో విడతలో 70 శాతం మంత్రిమండలి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు(80శాతం) నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే అవకాశం కల్పించాం. శాసనసభ స్పీకర్‌గా ఒక బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించడమే కాకుండా శాసన మండలి డిప్యూటీ ౖచైర్‌పర్సన్‌గా మైనార్టీ అక్కకు స్థానం ఇచ్చి సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాం. ఈ మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలు, శాసన మండలికి అధికారపార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. పరిషత్‌ ఎన్నికల్లో 13కు 13 జిల్లా పరిషత్‌లను అధికారపార్టీ దక్కించుకుంటే వీటిలో చైర్‌పర్సన్‌ పదవుల్లో ఏకంగా తొమ్మిది (70శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన మొదటి ప్రభుత్వం కూడా మనదే.

వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్‌లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ను నూతనంగా ఏర్పాటు చేశాం. వీటితోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను నియమించిన ఘనత, 139 బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. మండల పరిషత్‌ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు ఇలా ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా కనిపిస్తున్నారన్నది సత్యం.

95 శాతం హామీలు అమలు
మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి మూడేళ్లలోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదవాడి ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవటానికి మన ప్రభుత్వాలు, వాటి అధికారం ఉపయోగపడాలన్న మహాత్ముడి మాటల్ని తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉటంకించారు. ఈ భావాలను మనసా వాచా కర్మణా.. త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతూ ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ గడపగడపకూ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తూ మన సమాజంలో వెనుకబాటు, నిరక్షరాస్యత, సామాజిక అభద్రత, రాజకీయ అణచివేత, ఆర్థిక అవకాశాల లేమి వంటి ప్రతి అంశంపై సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటం కొనసాగుతుంది. గొప్పదైన ఈ దేశానికి, దేశ ప్రజలకు ప్రణామాలు సమర్పించుకుంటూ, దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికీ కలకాలం ఉండాలి. 

ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్‌ కె మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి కూడా హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top