ఎందుకీ కాలయాపన? | cm chandrababu naidu no response on Simhachalam incident | Sakshi
Sakshi News home page

ఎందుకీ కాలయాపన?

May 5 2025 5:04 AM | Updated on May 5 2025 6:57 AM

cm chandrababu naidu no response on Simhachalam incident

సింహాచలం ఆలయంలో ఇటీవల భక్తులపై కూలిన గోడ

సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబు నాన్చుడు ధోరణి

ఏడుగురు భక్తుల ప్రాణాలు పోతే ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదా?

సమీక్షలు జరిపి ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులపై చర్యలేవి?

ఘటన జరిగి ఐదు రోజులైనా చర్యలు నిల్‌ 

గోవాలో ఇలాంటి ఘటనే జరిగితే.. అదే రోజే ఐదుగురిపై వేటు 

అన్ని ఆలయాల్లో పరిస్థితిపై సమీక్ష.. వెనువెంటనే నిర్ణయాలు 

బాబు పాలనలో ప్రచారార్భాటం తప్ప మరేమీ లేదు 

ఈవో సెలవుపై వెళితే ప్రభుత్వం చేతులెత్తేస్తుందా? 

నిర్వహణ చేతకాక ఏడుగురి నిండు ప్రాణాలు బలిగొనడం దుర్మార్గం

సాక్షి, అమరావతి : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు భక్తులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి మంత్రి స్థానంలో ఉన్న వారెవరైనా అందుకు బాధ్యత వహిస్తారు. తక్షణమే తప్పు ఒప్పుకుని, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే ఘనత వహించిన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాను అందుకు భిన్నం అని చాటుకుంటున్నారు. తనకు కానీ, తన మంత్రి వర్గ కమిటీకి కానీ ఏమాత్రం బాధ్యత లేదని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే చంద్రబాబులో ఇసుమంత అయినా బాధ లేదు.. బాధ్యత అంతకంటే లేదని స్పష్టమవుతోంది.

ఎందుకంటే ఘటన జరిగి ఐదు రోజులైనా జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వ తప్పిదంగా ఒప్పుకోడానికి ఆయనకు మనసు ఒప్పడం లేదు. పైగా నాన్చుడు ధోరణి అవలంబిస్తూ తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు విచారణ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. చందనోత్సవం సందర్భంగా ముందుగానే నలుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినప్పుడు.. ఈ ఘటనకు ముమ్మాటికీ ఆ మంత్రులనే బాధ్యులుగా చేయాలి. దేవదాయ శాఖలో ముఖ్య అధికారులకు కూడా ఇందులో బాధ్యత ఉంటుందని చెప్పాలి. ఇది వెనువెంటనే జరగాల్సిన పని.

అలా చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. నిన్నటికి నిన్న గోవాలోని ఓ గుడిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించిందో దేశం మొత్తం చూసింది. కనీసం అది చూసి అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించక పోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలంలో ఈవో సెలవుపై వెళ్లారంటే ఇక అక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? మరో సమర్థవంతమైన అధికారి ఎవరూ లేరా? ఇలాంటి సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించే యంత్రాంగం లేదా? లేక ఆ యంత్రాంగాన్ని పని చేయనీయక పోవడం వల్ల ఈ ఘటన జరిగిందా? ప్రభుత్వ ముఖ్యుల ఇష్టారాజ్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్పష్టమవుతోంది. 

వీళ్లంతా ఇన్నాళ్లు ఏం చేశారు?
ఆలయ ధర్మకర్తగా కొనసాగుతున్న అశోక్‌గజపతి­రాజు, దేవదాయ శాఖ ముఖ్య అధికారి ప్రభుత్వ పె­ద్దలకు కావాల్సిన వారు కావడం వల్లే విచారణ పేరు­తో కూటమి సర్కారు కాలయాపన చేస్తోందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై నలుగురు మంత్రులతో ఏర్పడిన కమిటీ రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షించింది. ఆక్కడ గోడ అవసర­మనే విషయాన్ని ముందుగా ఎందుకు గుర్తించలేదు? తీరా చందనోత్సవానికి ముందు హడావు­డిగా నాలుగు రోజుల్లో అంత భారీ గోడ నిర్మించారంటే దాని నాణ్యత సంగతి ప్రత్యేకించి చెప్పా­లా? గోడ పక్కనే లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లేందుకు క్యూలైన్‌ ఏర్పాటు చేయడంలో మంత్రుల కమి­టీ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపి­స్తోంది. 

ఆ అధికారి అతి జోక్యం వల్లే సెలవుపై ఈవో!
సింహాచలం ఆలయ ఈవో కీలక చందనోత్సవాలకు మూడు నెలల ముందు వ్యక్తిగత కారణాలతో సెల­వుపై వెళ్లడానికి దేవదాయ శాఖ ముఖ్య అధికారి అతి జోక్యమే కారణమని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆలయ రోజు వారీ కార్యకలా­పా­ల్లోనూ ఆ అధికారి అతిగా కల్పించుకునేవారని తెలు­స్తోంది. ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యా­లయంలో అడిషనల్‌ కమిషనర్‌–2గా పని చేస్తున్న రామచంద్రమోహన్‌ కమిషనర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలోని అధి­కా­రులు.. పెద్ద ఆలయాల ఈవోలుగా కొనసా­గుతున్న జా­యింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారుల మధ్య ఏళ్ల తరబడి ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది.

రామచంద్రమోహన్‌ కమిషనర్‌గా బాధ్య­తలు చేపట్టిన తర్వాత ఇది మరింత ముదిరినట్టు ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఈవోగా కొనసాగే పెద్ద ఆలయాలు ఏడు వరకు ఉండగా, ఆ ఆలయాల్లో రెండింటికే దేవదాయ శాఖకు సంబంధించిన జా­యింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు ఉన్నారు. మిగిలిన ఆలయాలకు రెవెన్యూ శాఖ నుంచి డిప్యూ­టేషన్‌పై వచ్చిన డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికా­రులు ఈవో­లుగా కొనసాగుతున్నారు. 

అయి­తే కొన్ని నెలలుగా దేవదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆల­యాల్లో అక్కడి ఈవో రోజువారీ నిర్వహించా­ల్సిన కార్యక్రమా­ల్లోనూ కమిషనర్‌ కార్యాలయ ము­ఖ్య అధికారే ఎక్కువగా జోక్యం చేసుకుంటుండడంతోపాటు ఆలయాల్లో పనిచేసే తన అనుచర సిబ్బంది ద్వారా నేరుగా నిర్ణయాలు తీసుకుంటు­న్నా­రని.. అందువల్లే కొందరు అధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సింహా­చలం ఈవో మూడు నెలల క్రితం సెలవుపై వెళ్లిన­ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఆర్‌జే­సీగా కొనసాగుతున్న సుబ్బా­రావును సింహాచల ఆల­య ఇన్‌చార్జి ఈవోగా ప్రభు­త్వం నియమించింది. కీలక చందనోత్సవ సమయంలోనూ పూర్తి­స్థాయి ఈవో­ను నియమించలేక­పోయింది. ఈ పరిణా­మా­లన్నీ సింహా­చలం దుర్ఘటనకు పరోక్షంగా కారణమయ్యా­యనే చర్చ సాగుతోంది.

గోదావరి పుష్కరాల ఘటనలోనూ విచారణకే పరిమితం  
2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విచారణకే పరిమితమైంది. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత తాపీగా విచారణకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నాటి ఘటనకు కారకులు ఎవరన్న దానిని నిర్ధారించకుండానే విచారణను ముగించింది. 

గోవాలో తొక్కిసలాట ఘటనపై తక్షణ చర్యలు 
గోవా రాష్ట్రం షిర్‌గావ్‌లోని శ్రీలైరాయ్‌ దేవి ఆలయంలో రెండు రోజుల క్రితం తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడే స్పందించింది. ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఐదుగురు సీనియర్‌ అధికారులపై బదిలీ వేటు వేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. అన్ని ఆలయాల్లో పరిస్థితిపై సమీక్షించింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం సర్కారు విచారణల పేరుతో కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొన్న తిరుపతిలో, నేడు సింహాచలంలో భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నది నిర్వివాదాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement