
తాడేపల్లి : నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు చెవిరెడ్డి మోహిత్రెడ్డి. ఈ మేరకు సిట్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?, అది నిజం కాదు కనకే కదా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు.
ఇంకో 20 సంవత్సరాలు సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి.. పోలీస్ అధికారులపై అబద్ధాలు చెప్పగలరా?, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పదేళ్లు గన్మెన్గా పనిచేసిన మదన్రెడ్డిని సిట్ కార్యాలయంకు పిలిపించి విచారణ సమయంలో అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ అధికారులు చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించడం వల్లనే కదా.. అతను చనిపోతాను అన్నది’ అని మోహిత్ రెడ్డి నిలదీశారు.
ఒక హెడ్కానిస్టేబుల్ తనకంటే పై స్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లు రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి వుంటే అంత మాట అనగలడు. అందరూ ఆలోచించాలి’ అని అన్నారు.
తప్పుడు స్టేట్మెంట్లు కోసం కుట్రలు పన్నుతుంది మీరే కదా?, అంతా పారదర్శకంగానే జరుగుతుందని దేవుడు ముందు ప్రమాణం చేయగలరా?,నిజంగానే సిట్ అధికారులకు నిబద్ధత ఉంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కోరే దమ్ముందా?, తప్పకుండా ఏదో ఒక రోజు సత్యమేవ జయతే అవుతుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ దేవుడు, న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి’ అని మోహిత్రెడ్డి లేఖ ద్వారా స్పష్టం చేశారు.