బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు రూ.81,398 కోట్లు | Chandrababu Naidu has reneged on 143 promises including Super Six | Sakshi
Sakshi News home page

బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు రూ.81,398 కోట్లు

Jun 14 2025 5:16 AM | Updated on Jun 14 2025 5:16 AM

Chandrababu Naidu has reneged on 143 promises including Super Six

సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు 

వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పథకాలన్నీ రద్దు

నాడు తన హామీలకు ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’  పేరుతో ఇంటింటా బాండ్ల పంపిణీ 

చంద్రబాబు నైజం తెలిసి ప్రజలు నమ్మరేమోనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పూచీ 

వైఎస్‌ జగన్‌ పథకాలన్నీ కొనసాగిస్తామని..అంతకు రెండింతలు సంక్షేమం ఇస్తామని భరోసా 

నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలోకి.. 

రెండో ఏడాదిలోకి అడుగు పెడుతూనే సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశానంటూ బాబు ప్రకటన 

దీనిపై ఇంకెవరైనా మాట్లాడితే నాలుక మందం తప్ప మరోటి కాదంటూ హూంకరింపు 

చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనన్న వైఎస్‌ జగన్‌ 

నాటి వైఎస్‌ జగన్‌ మాటలు అక్షర సత్యంగా మారాయంటోన్న రాజకీయ విశ్లేషకులు  

దీపం పథకం కింద మహిళలకు రూ.3,218.48 కోట్లు ఎగవేత

తల్లికి వందనం పథకం కింద రూ.13,112.82 కోట్లు ఎగ్గొట్టి పంగనామాలు 

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.10,716.53 కోట్లు ఇవ్వని వైనం 

ఉచిత బస్సు కింద మహిళలకు రూ.3,500 కోట్లు ఎగవేత 

నిరుద్యోగ భృతి కింద యువకులకు రూ.7,200 కోట్లు మోసం 

మత్స్యకారులకు వేట నిషేధ భృతి తొలి ఏడాది రూ.265 కోట్లు ఎగవేత 

ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు రూ.32,400 కోట్లు ఎగనామం 

రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం చెల్లించని సర్కార్‌ 

50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్‌ పథకం కింద రూ.9,600 కోట్ల ఎగనామం

చెరువు గట్టున మర్రి చెట్టు కింద వేటాడే సత్తువ లేని ఓ ముసలి పులి కూర్చొని ఉండేది. చేతితో బంగారు కడియం పట్టుకుని.. అటుగా వెళ్తున్న బాటసారులను బంగారు కడియం ఇస్తా నా వద్దకు రా అంటూ పిలుస్తూ ఉండేది. ఒక రోజున చెరువు గట్టుపై నుంచి వెళ్తున్న బాటసారిని ముసలి పులి నా వద్దకు రా అంటూ పిలిచింది. బాటసారి భయపడి పారిపోతుంటే.. ‘భయపడకు.. నా చేతిలో బంగారు కడియం చూశావా.. నీలాంటి పుణ్యాత్మునికి ఈ బంగారు కడియం ఇస్తే నాకు స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది’ అంటూ ఆశ పెట్టింది. ‘నువ్వేమో క్రూర జంతువు.. నిన్నెలా నమ్మేది?’ అంటూ ఆ బాటసారి అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ ముసలి పులి పక్కనే ఉన్న నక్క జోక్యం చేసుకుంటూ ‘పండు ముసలి పులి పరుగెత్తలేదు.. పళ్లూడిపోయాయి.. మాంసం తినడం ఎప్పుడో మానేసింది.. చెరువులో శుభ్రంగా స్నానం చేసి రా.. బంగారు కడియం తీసుకో’ అంటూ ఊరించింది.

బంగారు కడియంపై ఆశపడ్డ బాటసారి.. నక్క చెప్పినట్టే చెరువులో స్నానం చేసి, మర్రి చెట్టు కింద కూర్చున్న ముసలి పులి వద్దకు వెళ్లాడు.. ముసలి పులి ఒక్కసారిగా బాటసారిపై పడి చంపేసి కడుపు నిండా తినేసింది.. మిగిలిపోయిన బాటసారి మాంసాన్ని నక్క తినేసింది. ఇదీ పంచతంత్రం నీతి కథ. ఈ కథ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది.

ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చారు. ఆ హామీల అమలు పూచీపత్రం ఇదిగో అంటూ ‘బాబు ష్యూరిటీృభవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఏటా పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఒనగూరే లబ్ధిని వివరిస్తూ ఇంటింటా బాండ్లను పంపిణీ చేశారు. గత చరిత్రను చూసి చంద్రబాబును ప్రజలు నమ్మరేమో అనే భయంతో.. ఆ హామీల అమలు పూచీ నాదీ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ భరోసా ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ పథకాలను కొనసాగించడంతోపాటు రెండింతలు సంక్షేమం అధికంగా ఇస్తామంటూ చంద్రబాబు, పవన్‌ నమ్మబలికారు. ఆ మేరకు ఎల్లో మీడియా కూడా ఊదరగొట్టింది. ఆ హామీలతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే తొలి ఏడాది సూపర్‌ సిక్స్‌లో ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మిగతా హామీలకు దిక్కే లేదు. ఆ హామీలన్నీ మోసాలుగా మిగిలాయి. సూపర్‌ సిక్స్, ఇతర పథకాల ద్వారా తొలి ఏడాది లబ్ధిని ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ లెక్కన చంద్రబాబు మొదటి ఏడాది మోసాల ఖరీదు రూ.81,397.83  కోట్లు.

సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అనే సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు, అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని  చాటిచెప్పారు. 

సూపర్‌ సిక్స్‌ సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా.. అంటూ ఎదురు దాడికి దిగుతూ వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఏడాదిలోనే రూ.1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. అయినా సరే ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకపోవడం గమనార్హం. 

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా పథకాల కిందే రూ.81,397.83 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తద్వారా చంద్రబాబును నమ్మి ఓటేయడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమేనని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అప్రమత్తం చేస్తూ నాటి సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలు అక్షర సత్యమని నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

అది మేనిఫెస్టో.. ఇది మాయఫెస్టో 
రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో నాలుగే నాలుగు పేజీలతో కూడిన మేనిఫెస్టోను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారు. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా తొలి ఏడాదే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.40,627 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్ల పాలనలో రూ.2,73,756.17 కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1,84,604.32 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. 

డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాలు కలిపితే ఐదేళ్లలో పేదలకు మొత్తం రూ.4,58,360.49 కోట్ల ప్రయోజనం కలిగించారు. మేనిఫెస్టో అమలు అంటే ఇదీ అని నిరూపించారు. కానీ.. సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాది సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయకుండా మేనిఫెస్టోను మాయఫెస్టోగా మార్చారు. వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూ నమ్మబలికి, అంతకంటే రెండింతలు సంక్షేమం ఇస్తామని నమ్మించి ప్రజలను నట్టేట ముంచారు.

మోసాలుగా మిగిలిన హామీలు 
» సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.32,400 కోట్లు ఎగ్గొట్టారు. 

»  దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్‌ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.

»    మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఈ హామీని అమలు చేయలేదు. అంటే.. ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండింటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చే వారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు. 

»   50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్‌ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్‌ రూపంలో ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది పెన్షన్‌ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు.

»  తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్‌ఈ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌–యూడైస్‌) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.

»  20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు.

»  ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు.

» వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. 2023–24లో పంటలు సాగు చేసిన రైతులకు బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగ్గొట్టారు. దాంతో రైతులకు బీమా పరిహారం రూ.1,385 కోట్లు రాలేదు.

»   మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వకుండా రూ.265 కోట్లు ఎగ్గొట్టారు.

సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశా అంటూ హూంకరింపు 
కూటమి సర్కార్‌ రెండో ఏడాదిలోకి అడుగు పెట్టాక తల్లికి వందనం పథకం కింద 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. 

ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీృ4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశానని.. 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. మొత్తంగా సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశానని, ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరోటి కాదంటూ హూంకరించారు.  

32,400 కోట్లు
18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ. 18 వేల చొప్పున‌ ఎగ్గొట్టిన ఆడబిడ్డ నిధి 
ల‌బ్ధిదారులు 1.80కోట్లు

3,218.48 కోట్లు
దీపం2 పథకం కింద మహిళలకు టోకరా
ల‌బ్ధిదారులు 1.59 కోట్లు

13,112.82 కోట్లు
తల్లికి వందనం పథకం కింద మహిళలకు రూ. 15 వేల చొప్పున‌ టోపీ
ల‌బ్ధిదారులు 87,41,885

1,385 కోట్లు
పంటల బీమా పరిహారం చెల్లించకుండా రైతులకు కలిగించిన నష్టం 
ల‌బ్ధిదారులు53 ల‌క్ష‌లు

9,600 కోట్లు
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెల‌కు రూ. 4 వేలు చొప్పున‌ ఇవ్వని పింఛన్‌ సొమ్ము   
ల‌బ్ధిదారులు 20 ల‌క్ష‌లు

10,716.53 కోట్లు
అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు  రూ. 20 వేల చొప్పున‌ అన్యాయం  
ల‌బ్ధిదారులు 53,58,266

265 కోట్లు
మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద రూ. 24 వేల చొప్పున‌ తొలి ఏడాది ఎగవేసిన మొత్తం    

7,200 కోట్లు
నిరుద్యోగ భృతి కింద యువతకు రూ. 36 వేల చొప్పున‌ దగా
ల‌బ్ధిదారులు 20 ల‌క్ష‌లు

3,500 కోట్లు
ఉచిత బస్సు కింద మహిళలకు మోసం 
ల‌బ్ధిదారులు 2.7 కోట్లు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement