అప్పుల భారం @ రూ.1,51,604 కోట్లు | Chandrababu Naidu has recently taken another loan of 7 thousand crores | Sakshi
Sakshi News home page

అప్పుల భారం @ రూ.1,51,604 కోట్లు

Jun 4 2025 2:09 AM | Updated on Jun 4 2025 7:44 AM

Chandrababu Naidu has recently taken another loan of 7 thousand crores

ఏడాది పాలనలో చంద్రబాబు చేసింది ఏమైనా ఉంది అంటే అవి అప్పులే..

అయినా సూపర్‌ సిక్స్‌ హామీల్లో ప్రజలకు ఇచ్చింది శూన్యం

తాజాగా మంగళవారం మరో రూ.7 వేల కోట్లు అప్పు

‘అప్పు’డు అలా..
మేం అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే రాష్ట్ర సంపద పెంచుతాం.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను భారీగా చేపడతాం –ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పలు

ఇప్పుడు ఇలా.. 
ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచింది.. ఏడాది  గిర్రున తిరిగింది.. మరి సీఎంగా చంద్రబాబు చేసింది ఏమున్నది అంటే.. రాష్ట్ర ప్రజలపై రూ.1,51,604 కోట్ల అప్పు భారం మోపడం.  

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను నమ్మి.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. కానీ, ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేసి.. ప్రజలకు పైసా ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఏడాది పాలనలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా భారీ అప్పుల భారం వేసింది. తాము గెలిచి ఏడాది అయినందుకు.. ప్రజలకు బహుమానంగా  మంగళవారం మరో రూ.7 వేల కోట్లు అప్పు చేసింది.

» తాజా అప్పుతో సరిగ్గా ఏడాదిలో బడ్జెట్‌ అప్పులే ఏకంగా రూ.1,01,194 కోట్లకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా 6.61 శాతం నుంచి 6.84 శాతం వడ్డీకి ఈ మొత్తం అప్పును సమీకరించింది. 

»  బడ్జెట్‌ లోపలే కాకుండా బడ్జెట్‌ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారు. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.19,410 కోట్లు అప్పు చేశారు. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రా­జధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

»  ఇంత పెద్దమొత్తంలో అప్పులు తెస్తున్నా సూపర్‌ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు ప్రజలకు ఇచి్చన సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. 

»  ఏడాది పాలనలో చంద్రబాబు సర్కారు చేసింది ఏమైనా ఉంది అంటే.. అది భారీగా అప్పులే. ఏపీఎండీసీకి చెందిన 436 మైనర్‌ గనుల లీజుల విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపించి తద్వారా ప్రైవేట్‌ బాండ్లు జారీ ద్వారా రూ.9 వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే రూ.3,489 కోట్ల మేర బాండ్లు జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్లు జారీ ద్వారా అప్పు చేయనుంది.  

» ఏడాదిలోనే ఇంత పెద్దఎత్తున గతంలో ఏ ప్రభుత్వమూ అప్పులు చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. లేని అప్పులను ఉన్నట్లు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. 

ఇప్పుడు బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా ప్రజలకు ఎల్లో మీడియా వాస్తవాలు తెలియజేయడం లేదు. పైగా చంద్రబాబు సర్కారు ఆస్తుల కల్పనకు గానీ సంక్షేమానికి గానీ పైసా వ్యయం చేయడం లేదు. ఒకపక్క ఎక్కువగా అప్పులు చేస్తూనే మరోపక్క సూపర్‌ సిక్స్‌ అమలుకు డబ్బుల్లేవంటూ ఏడాదిగా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement