చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం! | Chandrababu naidu false propaganda regarding the Tirumala Srivari laddu prasadam | Sakshi
Sakshi News home page

చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం!

Jan 31 2026 4:57 AM | Updated on Jan 31 2026 5:08 AM

Chandrababu naidu false propaganda regarding the Tirumala Srivari laddu prasadam

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన చంద్రబాబు

జంతు కొవ్వు కుట్ర బెడిసికొట్టడం.. దేశవ్యాప్తంగా బాబు క్షమాపణలు చెప్పాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లతో సరికొత్త కుతంత్రం 

శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు పక్కా పన్నాగం

సీఎం హోదాలో దుష్ప్ర చార కుట్రకు బాబు నేతృత్వం.. టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్రరచన...అమలు 

ఆ పాపుపు పనిలో పవన్‌ కల్యాణ్‌ కూడా పాత్రధారే.. లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకువచ్చేందుకు ప్రాయశ్చిత్తం’ హైడ్రామా 

ఆ కుతంత్రానికి ఎల్లో మీడియా వత్తాసు 

చంద్రబాబు దుష్ప్రచార కుట్రను తిప్పికొట్టిన సీబీఐ నివేదిక 

లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ 

ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ పరీక్షల్లో వెల్లడి 

అదే విషయాన్ని చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసిన సీబీఐ.. బెడిసికొట్టిన బాబు కుట్ర 

దాంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు ముఠా తాజా పన్నాగం 

చిన్నప్పన్న వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ వక్రీకరణ 

ఆయన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏగా పని చేశారు.. ఆనాటి టీటీడీ కొనుగోలు కమిటీ సభ్యులు.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యేలే 

భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే.. 2018లోనే నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టు 

చార్జ్‌షీట్‌లో పేర్కొన్న సీబీఐ 

నెయ్యి కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ.. అయినా దుష్ప్ర చారానికి చంద్రబాబు ముఠా బరితెగింపు 

శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే..! 

తిరుపతిలో ఫ్లైఓవర్‌ నిర్మాణం నుంచి ప్రైవేట్‌ బ్యాంకులో శ్రీవారి సొమ్ములు డిపాజిట్‌ దాకా అదే తీరు..  

‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’, గుజరాత్‌లోని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్‌ ప్రొఫైల్‌’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ – నెల్లూరు న్యాయస్థానంలో తాజాగా చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమై స్థానంలో ఉంటూ రాజకీయ కుట్రలతో ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసిందన్న తన నిరాధార ఆరోపణలు బెడిసికొట్టడం.. ముఖ్యమంత్రి హోదాలో మహాపచారానికి పాల్పడటంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటం, దారుణమైన అబద్ధాలాడిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్‌ చేస్తుండటంతో సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. 

లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబొ­రేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో తన పాచిక పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం మరో పన్నాగం పన్నింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టులు కేటాయించారని.. చిన్నప్పన్నను వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ వక్రీకరణలకు పాల్పడుతోంది.   

కట్టబెట్టింది టీడీపీ హయాంలోనే.. చార్జ్‌షీట్‌లో వెల్లడించిన సీబీఐ 
టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆపాదించేందుకు చంద్రబాబు బృందం పడరాని పాట్లు పడుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. భోలే బాబా డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. భోలే బాబా కంపెనీకి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారని సీబీఐ చార్జ్‌షీట్‌లో వెల్లడించడం గమనార్హం. 

ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నె­య్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీ­ఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొంది. ‘ల­డ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’, గుజరాత్‌లోని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌­ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నె­య్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్‌ ప్రొఫైల్‌’ పరీక్షించి మ­రీ నిర్ధారించాయి..’ అని సీబీఐ చార్జిషీట్‌లో తెలిపింది. 

.

ఆ శాంపిల్స్‌.. బాబు సీఎం అయ్యాక తీసినవే 
ఇక ప్రస్తుతం కల్తీ అంటూ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్‌ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక తీసిన శాంపిల్స్‌ అవి! ఆ నెయ్యి శాంపిల్స్‌ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో తీసినవే. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగింది. మరి ఆ నెయ్యిలో కల్తీ ఉంటే అందుకు బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనన్నది సుస్పష్టం.  

కొనుగోలు కమిటీలో కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి 
చంద్రబాబు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే... వైఎస్సార్‌సీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సభ్యులుగా ఉన్నారు. నాడు టీటీడీ పర్చేజ్‌ కమిటీలో సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం.  

అదంతా కల్తీయేనా బాబూ?
2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి నెయ్యి కిలో రూ.276 – రూ.314 మధ్య కొనుగోలు చేశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే అది తక్కువే. మరి దాన్ని బట్టి బాబు సర్కారు కొన్న నెయ్యి అంతా కల్తీయేనని భావించాలా?   

శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే..! 
తిరుమల శ్రీవారి నిధుల వినియోగంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. అందుకు టీటీడీ తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవరే నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లలో టీటీడీ 67 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం వెచ్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ కనీసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించారు. 

ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని వారించినా లెక్క చేయలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి టీటీడీ పాలకమండలిలో తీర్మానం చేసింది. అంతేకాదు.. నిర్మాణ వ్యయాన్ని రూ.40 కోట్లు తగ్గించి శ్రీవారి నిధులను ఆదా చేసింది. ఇక టీడీపీ హయాంలో టీటీడీ నిధు­లు రూ.1,300 కోట్లు ప్రైవేట్‌ రంగంలోని ఎస్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. 

కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్‌ చేయడంపై తీవ్ర విమర్శలు రేగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్‌ బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించి... ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయించింది. 

తప్పుడు నివేదిక బాబు హయాంలోనే..  
గతంలో భోలే బాబా డెయిరీ పేరు  హర్ష్‌ ఫ్రెష్‌ డెయిరీ’. ఆ పేరుతోనే 2018 మేలో తొలిసారి టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. లీటరు నెయ్యి కేవలం రూ.290కే సరఫరా చేస్తామని టెండరు వేస్తే టీటీడీ సమ్మతించి కాంట్రాక్టు కట్టబెట్టింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. హర్ష్ డెయిరీని తనిఖీ చేసేందుకు 2018 ఏప్రిల్‌ 17న అప్పటి టీటీడీ ఈవో నిపుణుల కమిటీని పంపారు. 

కానీ ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చి మోసగించింది. హర్ష్ డెయిరీ రోజుకు 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని... రోజుకు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ విధంగా తప్పుడు నివేదిక ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 18న 82 వేల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ మళ్లీ పాల్గొని టెండరు దక్కించుకుంది.  

వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు...ఏపీ భవన్‌ ఉద్యోగి 
తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్ర చారం చేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన్ను వైవీ సుబ్బారెడ్డి పీఏగా దుష్ప్ర చారం చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. 

ఏపీ భవన్‌లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. తిరుమల లడ్డూపై దుష్ప్ర చారం ఆపాలని, నిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ నేతలు కాదు. ఇక సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్‌లో వైఎస్సార్‌ సీపీ నేతలు సహా గత ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లు ఏ ఒక్కరివీ లేవు.  

రాజకీయ కుట్రతో ఇంతటి బరితెగింపా బాబూ...! 
కేవలం రాజకీయ స్వార్థం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డారు. సీఎం హోదాలో దుష్ప్ర చార కుట్రకు బాబు నేతృత్వం వహించగా టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన సాగించి అమలు చేశారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది, చేప కొవ్వులు కలిపారంటూ చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేశారు. ఏమాత్రం పాపభీతి లేకుండా శ్రీవారి ఆలయ పవిత్రతకు కళంకం తీసుకువచ్చేందుకు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేందుకు కుతంత్రం పన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం..’ అనే పేరుతో 2024 సెప్టెంబర్ 20న ఒంగోలులో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని దీనికి వేదికగా చేసుకోవడం గమనార్హం. 

ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారు. ఇక నారా లోకేశ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపి అపవిత్రం చేశారని దారుణమైన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిపినట్లు ఎన్‌డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొనడం గమనార్హం. 

అసలు విషయం ఏమిటంటే... తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు ఎన్‌డీడీబీ పరీక్షల్లో వెల్లడి కాలేదు. కేవలం రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు, ఆయన ముఠా ఎల్లో మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పక్కా పన్నాగం పన్నింది. ఇదిగో.. పంది కొవ్వు ఇంత శాతం..! ఆవు కొవ్వు ఇంత శాతం..! చేప కొవ్వు ఇంత శాతం..! అంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా పేజీలకు పేజీలు అవాస్తవ కథనాలతో  దుష్ప్రచారం చేశాయి. 

లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తెచ్చే కుట్రలో పాత్రధారిగా మారిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకంగా ప్రాయశి్చత్తం డ్రామాకు తెరతీశారు. మీడియా కెమెరాల ముందు విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లు కడిగి హైడ్రామాను రక్తి కట్టించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతారం ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు.  

లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు.. సీబీఐ దర్యాప్తులో వెల్లడి.. చార్జ్‌షీట్‌లో స్పష్టీకరణ 
తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌డీఆర్‌ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. 

ఈమేరకు నెల్లూరులోని న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సీబీఐ ఆ విష­యాన్ని స్పష్టం చేసింది. దాంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్ర చార కుట్రలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు వెంటనే ఖండించారు. 

ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ప్రభుత్వ పెద్దలు అమరావతికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాతే ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని  తాజాగా సీబీఐ నివేదిక వెల్లడించింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. 

శాస్త్రీయంగా విశ్లేషణ... సాధికారికంగా నిర్ధారణ... టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఆ విషయాన్ని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’, గుజరాత్‌లోని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌(ఎన్‌డీడీబీ)లకు పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. 

టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యా»ొరేటరీలు 2025 మార్చి 27, 2025 మే 16న రెండు వేర్వేరు నివేదికల్లో నిర్ధారించాయని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్‌ ప్రొఫైల్‌’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్‌ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్‌ (జి) లో సీబీఐ పేర్కొన్న వి­ష­యం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్‌ లేదని పరీ­క్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలె్రస్టాల్‌ ఉంటుంది. కొలె్రస్టాల్‌ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది.  

నెయ్యి కొనుగోలుకు టీటీడీలో పటిష్ట  వ్యవస్థ
రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే కుట్రతో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. టీటీడీ అనుసరించే పటిష్ట విధానం ఇదీ... 

లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్‌ చేసిన వాటిలో ఎల్‌ 1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు.   

ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ 
లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) గుర్తించిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి.  

ఓ ట్యాంకర్‌ నెయ్యి శాంపిల్‌లో 99.618 శాతం మిల్క్‌ ఫ్యాట్‌ ఉందని తేల్చుతూ ఎన్‌డీడీబీ కాల్ఫ్‌ 2024 జూలై 23న ఇచ్చిన టెస్ట్‌ రిపోర్టు 

ఎన్‌డీడీబీ టెస్ట్‌ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్‌ కలిసిందని.. ఫారిన్‌ ఫ్యాట్‌ కలిసి ఉండొచ్చునని ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌కు 2024 జూలై 27న ఇచ్చిన షోకాజ్‌ నోటీసులో పేర్కొన్న టీటీడీ మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ మురళీకృష్ణ  

 ఎన్‌డీడీబీ టెస్ట్‌ రిపోర్టు ఆధారంగా కేజీ నెయ్యిలో 208.851 మిల్లీ గ్రాముల వెజిటబల్‌ ఆయిల్‌ కలిసిందని.. ఫారిన్‌ ఫ్యాట్‌ కూడా కలిసి ఉండే అవకాశం ఉందని 2024 జూలై 28న ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌కు ఇచ్చిన రిజాయిండర్‌ షోకాజ్‌ నోటీసులో స్పష్టం చేసిన టీటీడీ మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌  

ఎన్‌డీడీబీ టెస్ట్‌ రిపోర్టు ఆధారంగా ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ 2024 జూలై 6, జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అదే నెల 22న సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న టీటీడీ అప్పటి ఈవో శ్యామలరావు (ఈయనే నెయ్యిలో జూలై 23న వనస్పతి డాల్డా వంటి వెజిటబుల్‌ ఆయిల్‌ కలిసిందని తిరుమలలో ఏడుకొండలస్వామి సాక్షిగా మీడియాకు చెప్పారు) 

» అలా ట్యాంకర్‌ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్‌ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్‌ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు.  

» తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్‌సీపీ హ­యాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవాలు. 

బాబు దుష్ప్రచారంపై జాతీయ మీడియాలో విమర్శల వెల్లువ 
తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కుట్ర పన్నడంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొనడాన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ టీవీ చానళ్లు, డిజిటల్‌ మీడియా కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. జంతువుల కొవ్వు కలిసింది అంటూ నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ శ్రీవారి భక్తులు, వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్‌ చేయడాన్ని జాతీయ మీడియా ప్రస్తావించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement