
ఉపాధ్యాయుల రేషనలైజేషన్లోనూ మెలికలు
బదిలీల్లో సీనియర్లకు తీవ్ర అన్యాయం
స్టేషన్ పాయింట్ల కేటాయింపుపై ఆందోళన
జీవో నంబర్ 47 ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్
పాత, కొత్త పాఠశాలల సర్వీసును పరిగణనలోకి తీసుకున్న గత ప్రభుత్వం
ఇప్పుడూ అదే రీతిలో సర్వీసు పాయింట్లు ఇవ్వాలంటున్న మిగులు టీచర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు గుబులు రేపుతోంది. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ మేరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే, గత ప్రభుత్వంలో చేసిన జీవో 117ను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా విడుదల చేసిన పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ నిబంధనలతో రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులు మిగులు (సర్ప్లస్) ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల మేరకు ప్రస్తుతం ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాలలోనే ఎనిమిదేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిలకడలేని కొత్త నిబంధనలతో మిగులు సమస్య ఏర్పడింది.
2023లో ఉపాధ్యాయ బదిలీల్లో ఈ సమస్య లేదని, జీవో నంబర్ 47 ప్రకారం మిగులు ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపులో సమన్యాయం పాటించి న్యాయం చేశారని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. జీవో నంబర్ 117 అమల్లో భాగంగా మిగులు ఉపాధ్యాయులకు పాత పాఠశాలలో పనిచేసిన కాలాన్ని, కొత్త పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని (పాత, కొత్త స్టేషన్) రేషనలైజేషన్ పాయింట్లు కేటాయించారు. కానీ, ఇటీవల విద్యా శాఖ విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో అనేక లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పాత పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే పాయింట్లు కోరుకుంటే వారికి ప్రస్తుత రేషనలైజేషన్ పాయింట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన బదిలీలలో మిగులు ఉపాధ్యాయులకు పాత, కొత్త స్టేషన్ల (పాఠశాల)లో పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్ల వరకు సర్వీసు పాయింట్లు కేటాయించారు. దీనికి అదనంగా రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇచ్చి న్యాయం చేశారు. అంతేగాక సర్ప్లస్ ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్లు (స్పౌజ్ వంటివి) ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మిగులు ఉపాధ్యాయులకు నష్టం జరగలేదు.
ఇప్పుడంతా గందరగోళం
జీవో 117 రద్దులో భాగంగా చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. పాఠశాలల మెర్జింగ్, సబ్జెక్టు టీచర్ల తొలగింపుతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పెంచడంతో దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు (సర్ ప్లస్) ఏర్పడుతున్నారు. విద్యాశాఖ కొత్త నిబంధనలతో సర్ ప్లస్ అయిన ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల కంటే మెరుగైన స్థానాలకు బదిలీ చేయాలి.
కానీ అందుకు విరుద్ధంగా ప్రక్రియ నడుస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పాఠశాలలో పని చేసిన కాలానికి ఇచ్చే స్టేషన్ పాయింట్లను కోరుకునే వారికి రేషనలైజేషన్ పాయింట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. కొత్త పాఠశాలలో పని చేసిన కాలానికి స్టేషన్ పాయింట్లు కోరుకున్న వారికి మాత్రమే రేషనలైజేషన్ పాయింట్లు ఇస్తామనడంతో మిగులు టీచర్లకు అన్యాయం జరుగుతోంది.
ప్రస్తుతం కొత్త పాఠశాలల్లో రెండు నుంచి నాలుగేళ్ల సర్వీసు గలవారే మిగులుగా మారుతున్నారు. వీరు పాత పాఠశాలలో ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పని చేశారు. ప్రస్తుత బదిలీల్లో వీరే నష్టపోతున్నట్టు తెలుస్తోంది. 2023లో ఇచ్చినట్టుగా పాత, కొత్త పాఠశాలల సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్లకు స్టేషన్ పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వమే బలవంతంగా బదిలీ చేస్తున్నందున న్యాయం చేయాలని మిగులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఉపాధ్యాయ చర్చల్లో కొందరికే ప్రాధాన్యం
బదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విద్యా శాఖ గత ఎనిమిది నెలలుగా ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందులో కేవలం 9 గుర్తింపు సంఘాలకే ప్రాతినిధ్యం కల్పించారు. కీలకమైన 34 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను దూరం పెట్టారు. దీంతో రిజిస్టర్డ్ సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఉపాధ్యాయ సమస్యలపై నిర్వహించే సమావేశాల్లో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలేగానీ, కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని ఆ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం సమావేశాల్లో ఐదు నెలల క్రితం ఒకసారి అవకాశం కల్పించారు. తాజాగా శనివారం నిర్వహించిన సమావేశానికి మాత్రమే గుర్తింపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే, అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాక నిర్వహించిన ఈ సమావేశంపై విమర్శలు వెల్లువెత్తాయి.