సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ | Chandrababu govt Singayya death incident distorted | Sakshi
Sakshi News home page

సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ

Jun 23 2025 5:16 AM | Updated on Jun 23 2025 10:03 AM

Chandrababu govt Singayya death incident distorted

చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం

వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో భద్రత ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం 

జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం 

ఆయన వాహనంపైకి దండెత్తుతున్న టీడీపీ అసాంఘిక శక్తులు 

సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం 

వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టు ప్రకటన 

అదే వాస్తవమైతే జగన్‌ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే 

పైలట్‌ వాహనాలు, రోప్‌ పార్టీ పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే 

వైఎస్‌ జగన్‌ను భూస్థాపితం చేస్తానన్న బాబు కుట్రలో భాగమే ఇదా!? 

లేదా వైఎస్‌ జగన్‌ ప్రజాదారణను ఓర్వలేక ఈర‡్ష్యతో డైవర్షన్‌ పాలిటిక్సా!? 

ఏది నిజమో సమాధానం చెప్పు చంద్రబాబూ..  పక్కా కుతంత్రంతో వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసు 

ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్న జగన్‌ను అడ్డుకునే కుతంత్రం 

వైఎస్‌ జగన్‌ వాహన డ్రైవర్‌ ప్రభుత్వ ఉద్యోగే.. ఆయనపై అబద్ధపు వాంగ్మూలం కోసం ఒత్తిడి 

ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి లొంగిన గుంటూరు ఎస్పీ సతీశ్‌ 

గుర్తు తెలియని ప్రైవేట్‌ వాహనం ఢీకొనే సింగయ్య మృతి అని మొదటి రోజే చెప్పిన ఎస్పీ 

ప్రభుత్వ ఒత్తిడితో 3 రోజుల్లోనే మాట మార్చిన వైనం  

అదే నిజమైతే చంద్రబాబు ప్రభుత్వమే దోషి అంటున్న నిపుణులు 

వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో భద్రతా వైఫల్యానికి ప్రభుత్వానిదే బాధ్యత    

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. 

అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీసింది. వైఎస్‌ జగన్‌ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్‌ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. 

అందుకోసం యావత్‌ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాహన డ్రైవర్‌గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుల్‌ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. 

ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు భిన్నంగా తాజాగా బీఎన్‌ఎస్‌ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్‌ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.

అడుగడుగునా భద్రతా వైఫల్యం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. 

వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్‌ జగన్‌ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్‌ మ్యాప్‌తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్‌ ప్లస్‌ భద్రత ప్రకారం వైఎస్‌ జగన్‌ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. 

ఆయన వాహనానికి ఇరువైపులా రోప్‌ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్‌ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్‌ పార్టీ పోలీసులు లేనే లేరు. 

దాంతో వైఎస్సార్‌సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్‌ జగన్‌ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్‌పైకి ఎక్కి మరీ హల్‌ చల్‌ చేశాడు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్‌పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. 

పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్‌ జగన్‌ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

కానీ ఆ వాహనం డ్రైవర్‌ రమణారెడ్డి (ఏఆర్‌ కానిస్టేబుల్‌)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.

అది జగన్‌ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రే
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. 



అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యే హెలీప్యాడ్‌ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్‌ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. 

ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చాలి. 

కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్‌సీపీ సొంత నిధులతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే 
ఉంది.

జగన్‌కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులు
వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్‌ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. 

ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్‌ జగన్‌ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. 

అందుకు ఇటీవల వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్‌తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్‌ జగన్‌ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. 

అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్‌ జగన్‌ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. 

అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌ భార్గవ్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. 

తాజాగా వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్‌!
ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్‌ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. 

ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్‌ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌
అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడై­నట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్‌ జగన్‌ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. 

సూపర్‌ సిక్స్‌ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్‌ జగన్‌ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. 

మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్‌ రాజకీయం అవసరమని గుర్తించారు. 

అందుకే వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.

గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడు
బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్‌ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. 

జూన్‌ 18 : వైఎస్‌ జగన్‌ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్‌లోని వాహనం కాదు. ప్రైవేట్‌ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106(1) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాశ్‌ అనుచరుడు గొట్టిపాటి హరీశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).

జూన్‌ 22 : వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్‌ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్‌ఎస్‌ 105(1), 
49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.

అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్‌పై ఒత్తిడి 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్‌గా  వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగంలో కానిస్టేబుల్‌గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వాహనానికి డ్రైవర్‌గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. 

ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పిన­ట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement