
పోలవరంలో మళ్లీ తప్పులు
1.5 మీటర్ల మందం బదులుగా 0.9 మీటర్లతో నిర్మాణం
తేల్చి చెప్పిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ
లోపాలను ఎత్తి చూపుతూ పీపీఏ, సీడబ్ల్యూసీలకు నివేదిక
మందం తగ్గించడంపై సమీక్షించాలని ప్రతిపాదన
32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దే కాంక్రీట్ మిశ్రమంలో నాణ్యత
డయాఫ్రం వాల్లో వాడే మిశ్రమం ఉష్ణోగ్రత
35 డిగ్రీలుగా గుర్తింపు.. కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉందని తేల్చిన వైనం
ఫలితంగా సిమెంట్, బెంటనైట్, కంకర తదితర ముడి పదార్థాలు విడిపోయి నాణ్యత లోపం
తొమ్మిది ప్యానళ్ల పైభాగంలో 1–2 మీటర్ల వరకు ఉపరితలంపై నీటి బుడగలు.. డయాఫ్రం వాల్పై రంధ్రాలు చేసి, సీపేజీ తీవ్రతపై పరీక్షలు చేయాలని సూచన
సీపేజీ ఉన్న చోట్ల 1–2 మీటర్ల ఎత్తున పునర్నిర్మించాలని ప్రతిపాదన.. 2016–18 మధ్య వరద ప్రవాహాన్ని మళ్లించకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం వల్లే కష్టాలు
వరద ఉధృతితో కోత.. ఇప్పుడు కొత్తగా నిర్మించడంలోనూ లోపాలపై నిపుణుల విస్మయం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) గ్యాప్–2లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా డయా ఫ్రం వాల్ (పునాది) పనులు చేస్తుండటాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. డయా ఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మించేలా డిజైన్ను ఆమోదిస్తే.. క్షేత్ర స్థాయిలో 0.9 మీటర్ల మందంతో బావర్ సంస్థ నిర్మిస్తోందని ఎత్తి చూపింది.
మందం తగ్గించటంపై తక్షణమే సమీక్షించి.. తగిన నిర్ణయం తీసుకోవాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి సూచించింది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని.. కానీ డయాఫ్రం వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది.
డిజైన్ ప్రకారం 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉండగా 0.9 మీటర్ల మందంతో నిర్మిస్తున్నారని.. మందం తగ్గించడంపై సమీక్షించాలని నివేదికలో పేర్కొన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ
గత మూడు నెలల్లో 52 ప్యానళ్లతో డయాఫ్రం వాల్ పనులు చేశారని, అందులో 9 ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ ఉపరితలంపై నీటి బుడగలు (సీపేజీ) ఉన్నట్లుగా చెప్పింది. సీపేజీ తీవ్రతను తేల్చడానికి ఇప్పటి దాకా వేసిన డయాఫ్రం వాల్పై రెండు నుంచి 3 మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేసి, పరీక్షలు చేయాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, సీపేజీ ఉన్న ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి.. మళ్లీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది.
గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించి.. 2018 జూన్ నాటికి పూర్తి చేసింది. దీంతో 2018 జూన్ తర్వాత వచ్చిన వరదలకు కోతకు గురై దెబ్బతింది. దాంతో దెబ్బతిన్న దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ వేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టిన డయాఫ్రం వాల్ పనులను సైతం లోపభూయిష్టంగా ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయనడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదిక తార్కాణమని రిటైర్డు చీఫ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు.
ఈ నెల 4న సీడబ్ల్యూసీకి నివేదిక
పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం సియాన్ హించ్బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానో ఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్ సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగోసారి గత నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాలు ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ.. వాటిని సరిదిద్దుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
పనుల్లో తీవ్ర జాప్యం
⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయా ఫ్రం వాల్ పనులను 66 వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం వర్షాలు ప్రారంభం కావడానికి ముందే అంటే 2025 జూన్ నాటికి 28 వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్ నాటికి 15 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 12 వేల చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. అంటే.. మూడు వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్లు స్పష్టమవుతోందని నిపుణుల కమిటీ తేల్చింది.

⇒ పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రం వాల్ ప్యానళ్లను అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్) లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే.. సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం విడ్డూరమని పేర్కొంది.
డయాఫ్రం వాల్లో సీపేజీ
⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనుల్లో ఏప్రిల్ వరకు 373 ప్యానళ్లు వేయాల్సి ఉండగా, 52 ప్యానళ్ల పరిధిలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇందులో 9 ప్యానళ్ల పరిధిలో డయాఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ నీటి బుడగలు బయటకు వస్తున్నట్లు(సీపేజీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించింది.
⇒ డయాఫ్రం వాల్లో వినియోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని గతంలో నిర్వహించిన సమావేశాల్లో తాము అధికారులకు చెప్పామని స్పష్టం చేసింది. కానీ.. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కాంక్రీట్ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నట్లుగా గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్లో నీటి శాతం అధికంగా ఉన్నట్లుగా పసిగట్టింది.
⇒ కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత, నీటి శాతం ఎక్కువగా ఉండటం, ముడి పదార్థాల మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేక పోవడం వల్లే సిమెంట్, బెంటనైట్, కంకర, ఇసుక, నీరు విడిపోతోందని (సెగ్రిగేట్), దానివల్ల అది పటిష్టంగా, నాణ్యంగా ఉండదని స్పష్టం చేసింది. అందువల్లే డయాఫ్రం వాల్లో సీపేజీ వస్తోందని అభిప్రాయపడింది.
⇒ సీపేజీ తీవ్రతను తేల్చడానికి తక్షణమే డయాఫ్రం వాల్పై రెండు మీటర్ల లోతు వరకు వరుసగా రంధ్రాలు వేసి.. పరీక్షలు చేయాలని పీపీఏకు సూచించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సీపేజీ ఉన్న చోట్ల డయాఫ్రం వాల్ పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ తొలగించి.. దానిపై కొత్తగా డయాఫ్రం వాల్ వేయాలని సిఫార్సు చేసింది.
నాడూ నేడూ అవే తప్పులు
⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రకారం.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను తొలుత పూర్తి చేయాలి. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాక.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్లు్ల, గ్యాప్–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్లను నిర్మించాలి.
⇒ కానీ.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వరదను మళ్లించే పనులను పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్లో ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించి, చారిత్రక తప్పిదం చేసింది. 2017 జూన్ వరకూ డయాఫ్రం వాల్ పనులు చేసింది. ఆ తర్వాత గోదావరి వరద ఆ డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో కోతకు గురైంది. అయినా సరే.. 2017 నవంబర్లో మళ్లీ పనులు ప్రారంభించి, 2018 జూన్ నాటికి గ్యాప్–2లో 1.396.6 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్ను పూర్తి చేసింది.
⇒ ఆ డయాఫ్రం వాల్పై 2018 జూన్ తర్వాత వచ్చిన గోదావరి వరద ప్రవహించింది. దీంతో వరద ఉద్ధృతికి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదిలోనే తేల్చింది. 2019 మే 30న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి.. 2021 జూన్ 11న గోదావరి వరదను మళ్లించింది.
⇒ ఆ తర్వాత గ్యాప్–1లో డయాఫ్రం వాల్ను పూర్తి చేసింది. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చడంలో సీడబ్ల్యూసీ తీవ్ర జాప్యం చేసింది. లేదంటే అప్పట్లోనే డయాఫ్రం వాల్ను పూర్తి చేసే వారని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు.. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు ఎగువన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి గతేడాది సెప్టెంబర్లో సీడబ్ల్యూసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలోనూ చంద్రబాబు సర్కార్ అవే తప్పులు చేస్తుండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ తుంగలోకి
⇒ పోలవరం ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయా ఫ్రం వాల్ నిర్మించడం శ్రేయస్కరమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు 6 మీటర్ల ఎగువన కొత్త డయా ఫ్రం వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది.
⇒ కొత్త డయా ఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో 1,396.6 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతుతో (పునాది) నిర్మించేలా ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా డిజైనర్ ఆఫ్రి డిజైన్ (ఆకృతి)ను రూపొందించింది. దాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సమీక్షించి, అనుమతి ఇచ్చింది. దాంతో ఆ డిజైన్ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయా ఫ్రం వాల్ను నిర్మించాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను నిర్దేశించింది.
⇒ డయాఫ్రం వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయా ఫ్రం వాల్ మందం గరిష్టంగా 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సీడబ్ల్యూసీ పేర్కొంది.
⇒ రూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్ పనులను 2016–18 మధ్య ఆ పనులు చేసిన బావర్ సంస్థకు మేఘా సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల (1500 మిల్లీ మీటర్లు) మందంతో కాకుండా 0.9 మీటర్ల (900 మిల్లీమీటర్లు) మందంతో బావర్ సంస్థ డయా ఫ్రం వాల్ పనులు చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. అంటే.. సీడబ్ల్యూసీ ఆమోదించిన మందం కంటే 0.6 మీటర్లు మందం తగ్గించి పనులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
⇒ మందం తగ్గించడంపై తక్షణమే సమీక్షించి.. దీనివల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది విశ్లేషించి.. దీనిపై సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పీపీఏకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్ను మరో ప్యానల్తో నిలువునా జత చేసేటప్పుడు (ఓవర్ల్యాప్).. 7.5 సెంటీమీటర్ల పొడవున ఒకదానితో మరొకటి జత చేస్తున్నారని.. కనీసం పది సెంటీ మీటర్ల పొడవున ఓవర్ ల్యాప్ చేయాలని సూచించింది. అప్పుడే సీపేజీకి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది.