ఈ ఆర్థిక ఏడాది తొలి నెలలోనే రూ.10,901 కోట్ల అప్పు
మూలధన వ్యయం కేవలం రూ.533 కోట్లే
కేంద్ర గ్రాంట్ల రూపంలో వచ్చింది సున్నా.. ఇది బాబు సర్కారు తీరు
ఏప్రిల్ బడ్జెట్ కీలక సూచికలను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన దొరికిన చోటల్లా అప్పులు చేయడం.. ఆ మొత్తాలను హంగూ ఆర్భాటాలకు వెచ్చించడం తప్ప ఆస్తుల కల్పనకు ఖర్చు చేయడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తుత ఆర్థిక ఏడాది (2026–27) తొలి నెల ఏప్రిల్ బడ్జెట్ కీలక సూచికలే వెల్లడించాయి. ఏ కుటుంబమైనా ఇల్లు కట్టుకోవడానికో.. ఏదైనా ఆస్తి సమకూర్చుకోవడానికో అప్పు చేస్తుంది. ఏదైనా ప్రభుత్వం అప్పుచేస్తే.. ప్రజలకు ఉపయోపడే ఆస్తి కోసం ఉపయోగిస్తుంది. అంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికో లేదా తాగునీటి అవసరాలు తీర్చడానికో అప్పులు చేసి.. తద్వారా వాటిని ప్రజలకు సమకూరుస్తుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నెలలో బడ్జెట్ లోపల ఏకంగా రూ.10,901 కోట్లను అప్పు చేసింది. ఆ మొత్తంలో కేవలం రూ.533 కోట్లను మాత్రమే ఆస్తుల కల్పన (మూలధన వ్యయం) కోసం ఖర్చు చేసింది. అంటే మూలధన వ్యయం కోసం వెచ్చించింది ఏప్రిల్ నెలలో కేవలం 1.10 శాతమే. ఈ విషయాన్ని ఏప్రిల్ నెల బడ్జెట్ కీలక సూచికల్లో కాగ్ నివేదిక వెల్లడించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పులో ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 14.37 శాతం మేర అప్పు చేసినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. చేసిన అప్పులను ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీకి సున్నా గ్రాంట్లే
ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లను రాబట్టింది ఏమీ లేదని (సున్నా) కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో పైసా కూడా గ్రాంట్ రాబట్టలేకపోయింది. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను రాబడుల్లో ఏప్రిల్లో కేవలం 6.35 శాతమే వచ్చాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మరోపక్క ఆర్థిక ఏడాది తొలి నెల ఏప్రిల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయినట్టు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ లోటును రూ.22,002 కోట్లకు పరిమితం చేస్తామని గొప్పగా పేర్కొనగా.. ఏప్రిల్ నెలలోనే రెవెన్యూ లోటు బడ్జెట్ ప్రతిపాదనల్లో 46.17 శాతం అంటే రూ.10,277 కోట్లకు చేరినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ప్రతిపాదనల ద్రవ్యలోటు ఏప్రిల్లోనే 14.37 శాతం చేరుకుంది.


