టీడీపీ ఆఫర్‌: నామినేషన్‌ వేస్తే రూ.2 లక్షలు! | Chandrababu is giving bumper offer to the Sarpanch candidates | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆఫర్‌: నామినేషన్‌ వేస్తే రూ.2 లక్షలు!

Feb 6 2021 5:28 AM | Updated on Feb 6 2021 1:08 PM

Chandrababu is giving bumper offer to the Sarpanch candidates - Sakshi

సాక్షి, తిరుపతి: పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్‌ అభ్యర్థులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్‌ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చేరవేస్తుంటే.. మరి కొందరికి రూపాయి కూడా ఇవ్వటంలేదని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలిసి.. డబ్బు అందనివారు చంద్ర బాబు, పార్టీ నేతలపై మండిపడుతున్నారు. సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉంది.

అందుకే నామినేషన్లు వేయటానికి కూడా పార్టీవారు ముందుకు రావటం లేదు. దీంతో అనేక గ్రామాల్లో పార్టీలకు అతీతంగా సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు, లోకేష్‌ జిల్లా నాయకులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఏకగ్రీవాలు కావటానికి వీల్లేదని, ఎవరో ఒకరిచేత నామినేషన్‌ వేయించి ఎన్నికలు జరిగేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఓడిపోతామని తెలుసు.. అయినా ఎన్నికలు జరిగేలా చూడటమే లక్ష్యం అని వారికి చెప్పినట్లు తెలిసింది.

ఎవరూ ముందుకు రాకపోతే.. కేవలం నామినేషన్‌ వేసి ఉపసంహరించుకోకుండా ఉంటే రూ.2 లక్షలు ఇస్తామని గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ తంత్రంతో కొన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. మొదటి విడత ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఆ పంచాయతీల్లో ఓటర్లకు ఆన్‌లైన్‌లో రూ.2 వేల వంతున పంపుతున్నట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల కోసం కర్ణాటక, తమిళనాడు నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున మద్యాన్ని దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement