
రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారమే పొదిలిలో వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు
వైఎస్ జగన్ ‘పొదిలి పోరుబాట’ను భగ్నం చేసేందుకు ఉన్నతస్థాయిలో కుట్ర
వైఎస్ జగన్ పర్యటనకు ముందే పొదిలిలో టీడీపీ ఎమ్మెల్యే కందుల కారు కదలికలు
ఆ వీడియోలుసోషల్ మీడియాలో హల్చల్
మాజీ సీఎం జగన్ పర్యటన ఉన్నా అదే సమయంలో టీడీపీ నిరసనలకు అనుమతివ్వడంపై సందేహాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత బుధవారం చేపట్టిన పోరుబాటను భగ్నం చేసేందుకు భారీ ఎత్తున కుట్ర జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారులు తెరవెనుక కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు మూడు రోజుల ముందు నుంచే పొదిలిలో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కారు రహస్యంగా తిరిగినట్లు తెలుస్తోంది.
ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్థానిక నాయకులు, పోలీసులు వద్దని మొరపెట్టుకున్నా వినకుండా అలజడి సృష్టించేందుకు పై స్థాయిలోనే కుట్ర పన్నినట్లు సమాచారం. ఇందులో భాగంగా పోలీసుల సమక్షంలోనే రెండుచోట్ల వైఎస్ జగన్ కాన్వాయ్తోపాటు రైతులపై రాళ్లు విసిరి పలువురిని గాయపరిచారు. తిరిగి వైఎస్సార్సీపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారు.
సీఎం చంద్రబాబు మెప్పు కోసమే
గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు వైఎస్ జగన్ పొదిలి పర్యటన ఖరారైనప్పటి నుంచే మార్కాపురం ఎమ్మెల్యే హడావుడి చేయడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 8న సీఎం చంద్రబాబు మార్కాపురం వచి్చనప్పుడు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఏమాత్రం బాగా లేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎలాగైనా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మెప్పు పొందాలని నిర్ణయించుకున్న నారాయణరెడ్డి... ఇందుకు వైఎస్ జగన్ పర్యటనను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనలో అలజడి సృష్టించడం ద్వారా మొత్తం కార్యక్రమాన్ని విఫలం చేయాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు ముందురోజు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు నారాయణరెడ్డి పొదిలిలోనే తిష్ట వేసి గొడవలకు పథకం రూపొందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పది ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్
వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పది ప్రాంతాల్లో నిరసనలు తెలిపేందుకు తొలుత పథకం రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, నిరసనలు తెలిపేందుకు స్థానిక నాయకులు విముఖత చూపడంతో ఇతర ప్రాంతాల నుంచి కిరాయి మూకలను తెచ్చి రెండుచోట్ల నిరసనలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుడు గుణుపూడి భాస్కర్ ఇంటి వద్ద 200 మందిని, నవాబ్మిట్టలోని పోలీస్స్టేషన్ సమీపంలో మరో 200 మందిని ఉంచి దాడులకు ఉసిగొల్పినట్టు విశ్వసనీయ సమాచారం.
అక్కడక్కడ భవనాలపై ముందుగానే చేర్చుకున్న రాళ్లను కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ కాన్వాయ్పై విసిరారు. పోరుబాటకు తరలివచ్చిన రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఇదంతా వీడియోల్లో చిత్రీకరించిన టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు పంపించినట్లు తెలుస్తుంది.
పోరుబాటలో రాళ్లదాడి జరుగుతుందన్న విషయం టీడీపీ పెద్దలకు, స్థానిక ఎల్లో మీడియాకు ముందే తెలుసుకున్న ప్రచారం జరుగుతోంది. టీడీపీవారు రాళ్లు, చెప్పులు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎమ్మెల్యే నారాయణరెడ్డి మార్కెట్ యార్డు పదవిని ఆశ పెట్టి కొందరు టీడీపీ నాయకులను నిరసనలకు ఉసిగొల్పినట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి.
పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ...
మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలికి వస్తున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తల నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసులు వద్దని చెబుతున్నా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు నిరసనలకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోనే 200 మందికి పైగా గుమిగూడినా ఎందుకు చెదరగొట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు.
మాజీ సీఎం కాన్వాయ్పైనే రాళ్లు విసురుతున్నా పక్కనే ఉన్న పోలీసులు వారించకుండా చోద్యం చూడడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాళ్లు విసిరినవారిని వదిలేసి ఎవరి ఆదేశాలతో రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేశారో పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది.
జాకెట్ ముక్కలు, నగదు పంపిణీ చేసిన పచ్చమూకలు
వైఎస్ జగన్కు వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకున్న మహిళలకు పచ్చమూకలు రూ.500 నగదు, జాకెట్ ముక్కలు పంపిణీ చేయడం మీడియా కంటపడింది. వైఎస్ జగన్పై అభిమానంతో పొదిలికి వచ్చిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వృద్ధులు, చిన్నారులు, మహిళలకే ఈ ప్లకార్డులు పంపిణీ చేస్తున్న దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్లకార్డులపై ఏమి రాసి ఉందో తమకు తెలియదని వారు చెబుతుండటం గమనార్హం.