breaking news
Kandula Narayana Reddy
-
రాళ్లు విసిరి.. కేసులు పెట్టి..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత బుధవారం చేపట్టిన పోరుబాటను భగ్నం చేసేందుకు భారీ ఎత్తున కుట్ర జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారులు తెరవెనుక కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు మూడు రోజుల ముందు నుంచే పొదిలిలో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కారు రహస్యంగా తిరిగినట్లు తెలుస్తోంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్థానిక నాయకులు, పోలీసులు వద్దని మొరపెట్టుకున్నా వినకుండా అలజడి సృష్టించేందుకు పై స్థాయిలోనే కుట్ర పన్నినట్లు సమాచారం. ఇందులో భాగంగా పోలీసుల సమక్షంలోనే రెండుచోట్ల వైఎస్ జగన్ కాన్వాయ్తోపాటు రైతులపై రాళ్లు విసిరి పలువురిని గాయపరిచారు. తిరిగి వైఎస్సార్సీపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు మెప్పు కోసమే గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు వైఎస్ జగన్ పొదిలి పర్యటన ఖరారైనప్పటి నుంచే మార్కాపురం ఎమ్మెల్యే హడావుడి చేయడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 8న సీఎం చంద్రబాబు మార్కాపురం వచి్చనప్పుడు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఏమాత్రం బాగా లేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎలాగైనా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మెప్పు పొందాలని నిర్ణయించుకున్న నారాయణరెడ్డి... ఇందుకు వైఎస్ జగన్ పర్యటనను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనలో అలజడి సృష్టించడం ద్వారా మొత్తం కార్యక్రమాన్ని విఫలం చేయాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు ముందురోజు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు నారాయణరెడ్డి పొదిలిలోనే తిష్ట వేసి గొడవలకు పథకం రూపొందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పది ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్ వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పది ప్రాంతాల్లో నిరసనలు తెలిపేందుకు తొలుత పథకం రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, నిరసనలు తెలిపేందుకు స్థానిక నాయకులు విముఖత చూపడంతో ఇతర ప్రాంతాల నుంచి కిరాయి మూకలను తెచ్చి రెండుచోట్ల నిరసనలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుడు గుణుపూడి భాస్కర్ ఇంటి వద్ద 200 మందిని, నవాబ్మిట్టలోని పోలీస్స్టేషన్ సమీపంలో మరో 200 మందిని ఉంచి దాడులకు ఉసిగొల్పినట్టు విశ్వసనీయ సమాచారం. అక్కడక్కడ భవనాలపై ముందుగానే చేర్చుకున్న రాళ్లను కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ కాన్వాయ్పై విసిరారు. పోరుబాటకు తరలివచ్చిన రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఇదంతా వీడియోల్లో చిత్రీకరించిన టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు పంపించినట్లు తెలుస్తుంది. పోరుబాటలో రాళ్లదాడి జరుగుతుందన్న విషయం టీడీపీ పెద్దలకు, స్థానిక ఎల్లో మీడియాకు ముందే తెలుసుకున్న ప్రచారం జరుగుతోంది. టీడీపీవారు రాళ్లు, చెప్పులు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎమ్మెల్యే నారాయణరెడ్డి మార్కెట్ యార్డు పదవిని ఆశ పెట్టి కొందరు టీడీపీ నాయకులను నిరసనలకు ఉసిగొల్పినట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ... మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలికి వస్తున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తల నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసులు వద్దని చెబుతున్నా రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు నిరసనలకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోనే 200 మందికి పైగా గుమిగూడినా ఎందుకు చెదరగొట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. మాజీ సీఎం కాన్వాయ్పైనే రాళ్లు విసురుతున్నా పక్కనే ఉన్న పోలీసులు వారించకుండా చోద్యం చూడడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాళ్లు విసిరినవారిని వదిలేసి ఎవరి ఆదేశాలతో రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేశారో పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. జాకెట్ ముక్కలు, నగదు పంపిణీ చేసిన పచ్చమూకలు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా రాసిన ప్లకార్డులు పట్టుకున్న మహిళలకు పచ్చమూకలు రూ.500 నగదు, జాకెట్ ముక్కలు పంపిణీ చేయడం మీడియా కంటపడింది. వైఎస్ జగన్పై అభిమానంతో పొదిలికి వచ్చిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వృద్ధులు, చిన్నారులు, మహిళలకే ఈ ప్లకార్డులు పంపిణీ చేస్తున్న దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్లకార్డులపై ఏమి రాసి ఉందో తమకు తెలియదని వారు చెబుతుండటం గమనార్హం. -
టీడీపీలో పెరుగుతున్న బీపీ
పదవుల కోసం కుమ్ములాటలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు మొదలైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆయా నియోజకవర్గాల్లో విభేదాలకు కారణమైంది. పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలు నియోజకవర్గ ఇన్చార్జులపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఇన్చార్జులుగా నియమితులైన చోట తెలుగుతమ్ముళ్లు బాహాటంగానే బాహాబాహీలకు దిగుతున్నారు. రెండు మూడు నియోజకవర్గాల్లో తమ ఇన్చార్జిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురంలో ప్రచ్ఛన్న యుద్ధాలు.. ఈ నియోజకవర్గంలో ప్రచ్ఛన్న యుద్ధాలకు కొదవేమీ లేదు. టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని వ్యతిరేకిస్తూ పార్టీలోనే ఉన్న టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్ అసమ్మతినేతగా గుర్తింపు పొందారు. పార్టీలోని ప్రధాన నాయకులు కాశీనాథ్కు మద్దతు ఇస్తున్నారు. తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, మార్కాపురం మండలాల్లోని పలువురు టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలోని వార్డు కౌన్సిలర్లు కాశీనాథ్కు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం పార్టీ రాష్ట్ర నాయకుని దృష్టికి వెళ్లింది. కందుల నారాయణరెడ్డిపై ఇటీవల మార్కాపురం, పొదిలిలలో కరపత్రాలను కూడా ప్రచురించారు. కరపత్రాల వెనుక సొంత పార్టీలోని ముఖ్య నాయకుల పాత్ర ఉందని కందులవర్గం అనుమానిస్తోంది. ఈ నెల ఒకటిన మార్కాపురం పట్టణంలో రజక సంఘం సమావేశానికి కరణం బలరాం వచ్చినప్పుడు ఆయనను ఇమ్మడి కాశీనాథ్ వర్గం కోర్టు సెంటర్లో ఆహ్వానించగా, పాత బస్టాండ్లో జరిగిన సమావేశానికి కందుల నారాయణరెడ్డి వర్గం ఆహ్వానించడం ద్వారా విభేదాలు బట్టబయలలయ్యాయి. కనిగిరి: ఈ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కనిగిరి నగర పంచాయతీలో రెండు, మూడు గ్రూపులుగా మారాయి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల మధ్య పోరు సాగుతోంది. పీసీపల్లి, పామూరు, సీఎస్పురంలో పాత, కొత్త టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఒకరు ఔనంటే మరొకరు కాదనే పరిస్థితి. పీసీపల్లిలో రేషన్ డీలర్లకోసం రెండు గ్రూపులు బహిరంగంగానే ఘర్షణ పడ్డారు. సీఎస్పురం మండలంలో రెండు రోజుల క్రితం పాఠశాల ప్రారంభోత్సవంలో పాత, కొత్త టీడీపీ నేతల్లో అసంతృప్తులు ప్రారంభయ్యాయి. దీంతో మంత్రి రావెల, ఎమ్మెల్యే కదిరి పాఠశాల భవనం ప్రారంభాన్ని వాయిదా వేసి వెళ్లారు. కనిగిరి మండలంలో కూడా పాత, కొత్త టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడింది. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. కందుకూరు: మార్కెట్యార్డు చైర్మన్ పదవి కేటాయింపు విషయంలో నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గ ఇన్చార్జీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ప్రధాన అనుచరుడు తల్లపనేని వెంకటేశ్వర్లుకి మార్కెట్యార్డు చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు. దీంతో మొదటి నుంచి ఈ పదవిని ఆశిస్తున్న పార్టీ సీనియర్ నాయకులైన పిడికిటి వెంకటేశ్వర్లు నాదెళ్ళ వెంకట సుబ్బారావు, ఘట్టమనేని చెంచురామయ్య, కండ్రా హరిబాబు, ఎంపీపీ అనూరాధ భర్త గుళ్లా శ్రీనివాసులు, సోమినేని రవీంద్ర వంటి నాయకులతోపాటు, మొదటి నుంచి శివరాంకి వ్యతిరేకంగా ఉండే జిల్లా డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు వర్గం కూడా శివరాంతో తలపడుతోంది. శివరాం వ్యవహరిస్తున్న తీరుపట్ల బహిరంగంగానే విమర్శలకు దిగడంతోపాటు వేరుకుంపటి పెట్టుకున్నారు. తామంతా దామచర్ల జనార్ధన్ వర్గంగా ప్రచారం చేసుకుంటున్నారు. శివరాంకి వ్యతిరేకంగా నియోజవకర్గంలో కార్యకలాపాలు ప్రారంభించారు. జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్ కూడా మొదట్లో అసమ్మతి వర్గంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం శివరాంతో కలిసిపోతున్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీకి అండగా ఉన్న నాయకులను వదిలేసి కేవలం తల్లపనేని వెంకటేశ్వర్లుకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవల మార్కెట్యార్డు చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలోను లుకలుకలు బయటపడ్డాయి. అసమ్మతి నేతలెవ్వరూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేదు. పైగా శివరాం వ్యవహార శైలిపై మంత్రి శిద్దారాఘవరావుకి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్కి ఫిర్యాదు చేశారు. యర్రగొండపాలెంలో జెడ్పీటీసీ డాక్టర్ మన్నె రవీంద్ర, ఇన్ఛార్జి అజితరావుల మధ్య కూడా పొరపచ్చాలు తారాస్థాయికి చేరాయి. అజితారావు భర్త బూదాల కోటేశ్వరరావు పెత్తనాన్ని రెండోవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై చంద్రబాబునాయుడి వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. ఇన్ఛార్జిని మార్చాలని మన్నె రవీంద్ర డిమాండ్ చేస్తున్నారు. రేషన్షాపు డీలర్ల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య మనస్పర్థలు పొడచూపుతున్నాయి. కోల్డ్వార్.. మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్కు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నం శ్రీధర్కు మధ్య సంతనూతలపాడు నియోజకవర్గంలో కోల్డ్వార్ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్కు శ్రీధర్ సరిగ్గా సహకరించలేదన్న కారణంతో మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి శ్రీధర్కు రాకుండా అడ్డం పడుతున్నారు. దీంతో నాలుగు మండలాలలోని టీడీపీకి చెందిన ఐదారుగురు మాజీ సర్పంచులు, గ్రామస్థాయి నాయకులు కరణం బలరాంను, దామచర్ల జనార్ధన్ ను కలిసి తమకు విజయ్కుమార్ను ఇన్చార్జి నుంచి తొలగించాలని ఇటీవల కొంత హడావుడి చేస్తున్నారు. ఇటీవల తమ నేత లోకేష్ను కలిసి విజయకుమార్ను తొలగించాలని కోరారు. అసంతృప్తి.. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమ సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ ఒంగోలు నియోజకవర్గంలో యాదవులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు యోగయ్య యాదవ్ ఇంట్లో యాదవ సామాజిక వర్గం సమావేశమై ఈ పదవి తమకే దక్కాలని డిమాండ్ చేసింది. ఈ పదవిని మరో సామాజిక వర్గానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ నిర్ణయించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి శిద్దాను కలసిన మాగుంట
ఒంగోలు: రాష్ట్ర రహదారులు, భవనాలు, రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం ఉదయం ఆయన స్వగృహంలో కలిసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు అర్ధగంటపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల ఎన్నికల కోడ్ సందర్భంగా మంజూరు చేయించిన పలు పథకాల పనులు ఆగిపోయాయని, వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో వారిని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, సంతనూతలపాడు టీడీపీ ఇన్చార్జి మన్నెం శ్రీధర్, ఒంగోలు సూపర్బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు కలిశారు. సిటీ బస్సులు నడపాలి: ఒంగోలు నగరంలో సిటీ బస్సులు నడపాలని సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, సయ్యద్సర్థార్ తదితరులు మంత్రి శిద్దా రాఘవరావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఆటో చార్జీలు ప్రయాణికులకు పెనుభారంగా మారాయని, అందువల్ల సిటీ బస్సులు నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డిపో అధికారులు సిటీ బస్సులు నడపకుండా వంకలు చెబుతున్నారన్నారు. జేఎన్యూఆర్ఎం నిధులతో సంబంధం లేకుండానే సిటీ బస్సులు నడిపేందుకు దృష్టి సారించాలని, దాంతోపాటు పలు మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులతోను, రవాణాశాఖ అధికారులతో సమీక్షిస్తానని, తప్పకుండా అభివృద్ధి పనులు చేపడదామంటూ మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రికి అభినందనల వెల్లువ: మంత్రి శిద్దా రాఘవరావుకు అధికారులు, అనధికారులు పలువురు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆర్టీసీ సీఎంఈ రవికాంత్, ఆర్టీసీ నాయకులు తిరుమలేషు, పలువురు ఎక్సయిజ్ అధికారులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు పలువురు జనసేన నాయకులు కూడా శిద్దాను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. -
అమీతుమీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో, రెండవ జాబితాలో తమ పేర్లు ఉంటాయా లేదా అనే అనుమానంతో అధిష్టానంపై యుద్ధం ప్రకటించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. తొలి జాబితాలో వివాద రహితంగా ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలినవన్నీ వివాదాస్పదం కావడంతో, ఆ అభ్యర్థుల పేర్లు ప్రకటించే విషయంలో అధిష్టానం సంశయిస్తోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహం చెందిన నాయకులు ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అదే పరిస్థితి పునరావృతమైతే పార్టీ పరువు పోతుందని భావిస్తున్నారు. దీంతో అధిష్టానం ముందుగా నాయకులను బుజ్జగించే పనిలో పడింది. తమకు సీటు ఖరారవుతుందా లేదోననే మీమాంసతో కొందరు ఆశావహులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనకు ఎట్టి పరిస్థితిల్లోనూ రెండవ జాబితాలో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. అయినా ఎందుకైనా మంచిదని ఆయన హైదరాబాద్ చేరుకుని పైరవీలు చేసుకుంటున్నారు. తనకు స్థానం దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని అంటున్నట్లు తెలిసింది. కందుకూరు సీటు ఆశిస్తున్న దివి శివరాం ఈ సారీ తనకే టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తనకు 60 ఏళ్లు నిండాయని, ఇకపై తాను ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదని, తనకు ఈ స్థానం కేటాయించకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నట్లు తెలిసింది. కందుకూరును తనకే కేటాయించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కూడా కోరుతున్నారు. శివరాం ఇప్పటికీ అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారని, ఈ సారి తనకు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. దామచర్లను ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ఒంగోలులో పోటీ చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని తటు ్టకోవడం తనకు సాధ్యం కాదని ఆయన వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. గిద్దలూరు నుంచి పిడతల సాయికల్పన రెడ్డి టీడీపీ టికెట్ కోరుతుండగా, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం కాంగ్రెసునాయకుడిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే తనకు సీటు దక్కని పక్షంలో పార్టీకి పని చేయనని సాయికల్పన తేల్చిచెబుతున్నట్టు సమాచారం. ఈ తరహా పరిణామాలతో జిల్లాలో సీట్ల కేటాయింపు చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలిసింది. ఏది ఏమైనా తమకు సీట్లు దక్కకపోతే, అధిష్టానంతో యుద్ధం చేయక తప్పదని చెపుతున్న కొందరు నాయకులు ఆ మేరకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.