
రాజ్యసభ స్థానాన్ని తన మనిషికి ఇప్పించుకునేందుకు తీవ్ర యత్నం
తనకు అనుకూలంగా ఉండే వారి కోసం లాబీయింగ్
అవేమీ పట్టించుకోని బీజేపీ అధిష్టానం
పార్టీ పాత నేత పాకా సత్యనారాయణకే అవకాశం
సొంత నిర్ణయాలు తీసుకుంటోందంటున్న విశ్లేషకులు
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పని చేయలేదు. ఆయన్ను పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిసింది.
ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాతో మాట్లాడినట్లు సమాచారం. కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని తన మాయజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు యత్నించారు. ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్ కూడా చేయించారు.
బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం విశేషం.
రకరకాల ప్రచారాలు..ఎత్తులు
తాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిశాక, మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లు తెలిసింది. ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైకి ఇస్తారనే ప్రచారం జరిగింది.
కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది. నిజానికి ఒరిజినల్ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది.
కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజు వంటి వారంతా సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న వారుగా పేరుంది.
చంద్రబాబుకు షాకే!
చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మంది చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిస్తారు. తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవినైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిసూ్తనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన మనుషులకే పదవులు కూడా దక్కాయి.
కానీ కొద్ది కాలంగా బీజేపీ బాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి. ఈ నిర్ణయాలు ఒకరకంగా చంద్రబాబుకు షాక్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.