గుంటూరు: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్స్ పూర్వపు హ్యాండిల్ ట్విట్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేయడం సంచలనంగా మారింది. దీనంతటికి కారణం ఏపీలోని గుంటూరు పోలీసులేనని విషయం తేటతెల్లమైంది. ఎఫ్బీఐ పేరుతో ఎక్స్ కు ఫిర్యాదు చేసి గుంటూరు పోలీసులు బ్లాక్ చేయించారనే విషయం బయటపడింది. ఎలాగైనా ప్రతిపక్ష సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయించాలనే కుట్రతో ఎఫ్బీఐ పేరు వాడినట్లు తేలింది. దీనిపై ఏపీ పోలీసుల్ని ఎక్స్ సైతం ప్రశ్నించింది.
అసలు ఏం జరిగిందంటే.. Tent politics పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. ఇందుకు ఎఫ్బీఐ పేరును వాడుకున్నారు. ‘మీరు పెట్టిన పోస్ట్ను తొలగించాలంటూ’ Tent politicsకు అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపినట్టు మెయిల్ పంపారు గుంటూరు పోలీసులు.

అయితే ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి టెంట్ పాలిటిక్స్.. ఎక్స్ లీగల్ సపోర్ట్ టీమ్కు మెయిల్ చేసింది. అయితే ఫెడరల్ బ్యారో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఈ-మెయిల్ రాలేదని తేల్చింది ఎక్స్. దీనిపై గుంటూరు పోలీసులకు మొట్టికాయలు వేసింది ఎక్స్. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపినట్టు ఎలా మెయిల్ పంపారని గుంటూరు పోలీసులను ఎక్స్ ప్రశ్నించింది.
ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్!


