అప్పటి సర్వీస్‌ కమిషన్‌ కాదు బాసూ | APPSC is recognized as a dispute free commission in the country | Sakshi
Sakshi News home page

అప్పటి సర్వీస్‌ కమిషన్‌ కాదు బాసూ

Feb 24 2024 4:30 AM | Updated on Feb 24 2024 4:30 AM

APPSC is recognized as a dispute free commission in the country - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌.. ఒకప్పుడు చంద్రబాబు సేవలో తరించిన ఈ సంస్థ.. ఇప్పుడు నిరుద్యోగుల సేవలో లీనమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ సంస్థను పూర్తిగా ప్రక్షాళన జరిపి, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే కేంద్రంగా మలిచారు. ఇది గత నాలుగున్నరేళ్లల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేసింది. అంతేకాకుండా సచివాలయాల్లో ఒకేసారి 1.21 లక్షల మందిని నియమించి రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్‌–1, గ్రూప్‌–2 వంటి గెజిటెడ్‌ పోస్టులతో పాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్లు, అగ్రికల్చరల్‌ ఆఫీసర్లు, మరెన్నో నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు నియామకాలు పూర్తి చేశారు. ఒక్క కోర్టు కేసు లేదు.. ఒక్క విమర్శా లేదు.. ఒక్క ఫిర్యాదూ లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదకలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడే పచ్చ మీడియా బాసు రామోజీకి కాలేది.

‘ఏ వివాదం లేకుండా, ఉద్యోగాలెలా ఇచ్చేస్తారు? అసలు వివాదాలు పెట్టేదే ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి కదా. చంద్రబాబు హయాంలో అంతా ఇలానే జరిగింది కదా! ఇప్పుడంతా సక్రమంగా జరగడమేంటి’ అంటూ లోలోన మండిపోయి.. ఏపీపీఎస్సీపై ఓ బండ వేయాలని చూశారు. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీలో చైర్మన్, సభ్యుల నియామకాల్లో జరిగిన ఆశ్రిత పక్షపాతం, అవకతవకలను వదిలేసి, ఇప్పుడు కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగినప్పటికీ, ‘‘ఏపీపీఎస్సీనా? వైసీపీఎస్సీనా?’’ అంటూ ఈనాడు పత్రికలో విషం కక్కారు. 

కమిషన్‌ను కమీషన్లతో నింపేసిన బాబు
చంద్రబాబు సీఎంగా ఉండగా ఏపీపీఎస్సీని తన అభిమానులు, తనకు సేవ చేసే వారితో నింపేశారు. ఆయన హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ తెలియని పరిస్థితి. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌ పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు వంటి కారణాలతో నిలిచిపోవడమో లేక పరీక్షలు రద్దు కావడమో జరిగేవి. 2014–18 మధ్య ఇచ్చిన నోటిఫికేషను వేళ్లపై లెక్కించేవే అయినా దాదాపు 350కి పైగా కేసులు పడ్డాయి. అసలు సభ్యుల నియామకమే కమీషన్లపై జరిగిందని ఆ పార్టీలోని ముఖ్య నేతలే విమర్శించారు.

2014 ఎన్నికలకు ఎన్నారైల నుంచి నిధులు సేకరించినందుకు ఉదయ్‌ భాస్కర్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవి కట్టబెట్టారన్న విమర్శలు ఉండేవి. సభ్యుల విషయానికి వస్తే నాటి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె గుర్రం సుజాత, తాడికొండలో టీడీపీ అభిమాని విజయకుమార్, నాటి హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సిఫారసుతో పద్మరాజును నియమించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాటి ఐఏఎస్‌ అధికారి సతీష్‌చంద్ర తన శిష్యుడు రామరాజుకు సభ్యుడిగా పదవి ఇప్పించారు.

మరో సభ్యుడు రంగ జనార్థన్‌ కూడా ఇలా వచ్చినవారే. వీరికి పదవులు ఇచ్చే ముందే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగి భాస్కర్‌ నాయుడు తిరుపతిలో వీరితో వేర్వేరుగా సమావేశమై, తాము చెప్పినట్టు వింటేనే పదవులు ఉంటాయని హెచ్చరించిన విషయం ఎల్లో మీడియా కప్పిపుచ్చినా బయటకు వచ్చేసింది. 

♦  2016లో నోటిఫికేషన్‌ ఇచ్చి, 2017 జూలైలో నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను ఎంత వివాదాలతో నింపేశారో ప్రతి నిరుద్యోగికీ తెలుసు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగాల్సిన పరీక్షను వారికి అవసరమైన వారికోసం విశాఖపట్నం గీతం కాలేజీ, మరికొన్ని చోట్ల సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహించి వేల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. కొన్ని ప్రశ్నలు ఉద్దేశపూర్వకంగా బయటకు వెల్లడించగా.. ఇవన్నీ గీతం కాలేజీ కేంద్రంగానే జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. 

♦ అధికార పార్టీ పెద్దలతో సాన్నిహిత్యమున్న కొన్ని కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు ఏపీపీఎస్సీలో తిష్టవేసి ఇష్టారీతిన వ్యవహారాలు నడిపించాయి. తమ వద్ద చదివిన వారు ఒకే కేంద్రంలో వరుసగా వచ్చేలా ఏర్పాట్లు చేయించుకొని మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాల  స్క్రీన్‌షాట్లు ఏకంగా వాట్సప్‌లలో ప్రత్యక్షమయ్యాయి.

♦ కమిషన్‌లో మెజారిటీ సభ్యుల ఆమోదంతో తీసుసుకోవాల్సిన నిర్ణయాలను నాటి చైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌ ఒక్కరే తీసుకుని వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.

♦ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా 2017లో జీవో నం.55 విడుదల చేసి, డిపార్ట్‌మెంటల్‌ టెస్టుల్లో ‘మైనస్‌ మార్కు’లను అమల్లోకి తెచ్చింది. దాంతో అంతకుముందు ఏటా సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4 నుంచి 6 శాతం మించలేదు. కొన్ని విభాగాల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కోల్పోయారు. 

♦    అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్‌లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు.

ఇప్పుడు నిబద్ధతతో పనిచేసే వారికే సభ్యులుగా అవకాశం
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. అన్ని అర్హతలున్నవారు, సమర్థతతో పనిచేసే వా­రు, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వారిని సభ్యులుగా నియ­మించింది. దాంతో గత నాలుగేళ్లల్లో ఏపీపీ­ఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 పోస్టులను సకాలంలో భర్తీ చేసింది. ‘సచివాలయ’ వ్యవస్థలో ఒకేసారి 1.21 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే బాధ్యతను కూడా కమిషన్‌ విజయవంతంగా నిర్వర్తించింది.

ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశచరిత్రలోనే లేదు. గత డిసెంబర్‌లో 899 గ్రూప్‌–2 పోస్టులతో పాటు గ్రూప్‌–1, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, జూ­నియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు వంటి దాదాపు 1,446 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈనెల 25న జరిగే గ్రూప్‌–2 పరీక్షకు ఎల్లో మీడియా, టీడీపీ కలిసి ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించిన­ప్పటికీ, సర్వీస్‌ కమిషన్‌ సమర్థంగా అధి­గమించి ముందుకెళుతోంది.

2019–23 మధ్య ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫి­కేషన్లలో ఒక్కటి కూడా వాయిదా పడ­లే­దు. నిరుద్యోగుల నుంచి ఒక్క కేసు న­మో­దైందీ లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రశంస­లూ పొందింది. అయినా, వాస్తవాలన్నింటి­నీ కప్పిపుచ్చి ఎల్లో బాసు రామోజీ మా­త్రం అక్రమాలంటూ అభాండాలు వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement