సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు.
డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు.
పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్.


