చెక్కు అందజేస్తున్న కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, జహీర్ అహ్మద్
బాలిక చికిత్సకు రూ.2 లక్షల సాయం
జగదాంబ (విశాఖ): నిరుపేద కుటుంబానికి చెందిన ఓ చిన్నారి చికిత్సకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి జోయా మహ్మద్ చికిత్స కోసం రూ.2 లక్షల చెక్కును పంపించి ఆ కుటుంబానికి ఆశాకిరణంగా నిలిచారు. విశాఖపట్నం 39వ వార్డుకు చెందిన మహమ్మద్ ఆసీఫ్–ఆíÙత దంపతుల కుమార్తె జోయా కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ వేడుకకు వచి్చన సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సమస్యలను వివరించారు.
వెంటనే స్పందించిన వైఎస్ జగన్ చిన్నారి చికిత్స కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్కు పంపించారు. శనివారం వారు ఆసీఫ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పార్టీ నాయకులు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గతంలోనూ సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారు రూ.18 లక్షలు మంజూరు చేశారు. మొదట రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించగా, మిగిలిన మొత్తం కూడా విడుదల చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికలు రావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించాల్సిన మిగిలిన సహాయం నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు అధికారులను సంప్రదించినా సహాయం అందలేదని చెప్పారు.
అంతేకాక చిన్నారి తండ్రి చేస్తున్న ఎండీయూ (రేషన్ డిపో ఆపరేటర్) ఉద్యోగం, తల్లి చేస్తున్న వలంటీర్ ఉద్యోగం కూడా నిలిపివేయడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. దీంతో వైఎస్ జగన్ వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా కేకే రాజు, వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో విశాఖ పశి్చమ పరిశీలకుడు జహీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.


