‘చినబాబు సర్వీసు’ కమిషన్‌! | APPSC Interview Candidates Fires On Coalition Govt And Nara Lokesh, Check Out More Details | Sakshi
Sakshi News home page

‘చినబాబు సర్వీసు’ కమిషన్‌!

Jun 25 2025 5:28 AM | Updated on Jun 25 2025 9:18 AM

APPSC Interview candidates fires On Coalition govt, Nara Lokesh

గ్రూప్‌–1 ఇంటర్వ్యూల్లో గూడుపుఠాణీ.. అంతా గుంభనంగా! 

తొలుత మూడు బోర్డుల ఏర్పాటుకు కమిషన్‌ ప్రణాళిక  

ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక్క బోర్డుకే పరిమితం 

చివరి నిమిషంలో సీనియర్లను పక్కనబెట్టి ఆగమేఘాలపై కొత్త సభ్యుడి నియామకం 

గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం.. 

వెనువెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి సబ్జెక్టును పక్కనబెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఆరా.. 

సీఎం చంద్రబాబు కీర్తనలు.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు 

అమరావతి చుట్టూనే గుచ్చిగుచ్చి అభ్యర్థులకు ప్రశ్నలు.. తమ వారికి మాత్రమే పోస్టింగులు ఇచ్చే ఎత్తుగడ 

చినబాబు కనుసన్నల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అభ్యర్థుల్లో అనుమానాలు 

ఇవేం ఇంటర్వ్యూలు..? ఇంత సిల్లీగా ఏం ప్రశ్నలివి?.. ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధం.. లీగల్‌గా చెల్లవు..  

ఏపీపీఎస్సీ ఏకపక్ష పోకడలు.. కూటమి సర్కారు నిర్వాకాలపై ఇంటర్వ్యూ అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు

నారా చంద్రబాబునాయుడు..! వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..!  వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారు? రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది..! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అమరావతే రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు..! దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసింది ఏ బహిరంగ సభలోనో.. ఏ రాజకీయ నాయకుడో కాదు.. తాజాగా గ్రూప్‌–1 ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నలివీ!!  

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 ఇంటర్వ్యూలు దారి తప్పాయి! రాష్ట్రంలోని అత్యుత్తుమ సర్వీసుల్లో.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన కనీస నిబంధనలను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ) రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిపో­యింది! రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సర్వీస్‌ కమి­షన్‌ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంపై ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఎన్నడూ లేనివిధంగా కమిషన్‌లో ఇతర సభ్యులను పక్కన పెట్టడం.. చివరి నిమిషంలో ఓ సభ్యుడిని తీసుకురావడం.. ఇంటర్వ్యూల నిర్వహణకు మూడు బోర్డులకు బదులుగా ఒకే ఒక్క బోర్డుకు పరిమితం కావడం.. లాంటివన్నీ గుంభనంగా సాగుతున్న వ్యవహారాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. దీనిపై న్యాయ వివాదాలు రేకెత్తితే ప్రక్రియ అంతా మళ్లీ మొదటికొస్తుందని, అడ్డగోలు నిర్ణయాలు లీగల్‌గా చెల్లుబాటు కావని పేర్కొంటున్నారు. 

పారదర్శకంగా ఉండాల్సిన కమిషన్‌ చరిత్రలో తొలిసారి అత్యంత జూనియర్‌ సభ్యుడిని తాజాగా గ్రూప్‌–1 ఇంటర్వ్యూ బోర్డులో నియమించడం గమనార్హం. అది కూడా ఆదివారం నియామక ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ప్రమాణస్వీ­కారం చేయించి మంగళవారం నుంచి బోర్డులోకి తీసుకున్నారంటే గ్రూప్‌–1 ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డులో సభ్యులుగా ఉన్నవారు ఆ రోజు మొత్తం జరిగే ప్రక్రియలో పూర్తిగా ఉండాలి. కానీ ఓ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ మధ్యాహ్నం తరువాత వెళ్లిపోయారు. 

ఇంటర్వ్యూ ముంగిట ఇదేం తీరు?
2023 గ్రూప్‌–1 నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంట­ర్వ్యూల కోసం స్పోర్ట్స్‌ కేటగిరీలో 42 మందిని, జనరల్‌ కేటగిరీలో 182 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 23 నుంచి ఇంటర్వ్యూలు ప్రారం­భమయ్యాయి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్‌తోపాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడుగా ఏదైనా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ పాల్గొనడం తప్పనిసరి. 

కానీ ఇప్పుడు ఇవేమీ లేకుండా అంతా గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు తొలుత మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ.. చివరికి కూటమి ప్రభు­త్వంలో ఓ కీలక మంత్రి ఆదేశాలతో ఒకే ఒక్క బోర్డుకు కుదించినట్లు సమాచారం. 

ఒక్క బోర్డు ఉంటే ప్రభుత్వ పెద్దల అభీష్టం మేరకు ఎంపిక జరు­గుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ప్రతిభకు తీరని అన్యాయం జరుగుతుందని, సంవత్సరాల తరబడి తదేక దీక్షతో సిద్ధమై ఇంటర్వ్యూ వరకు వచ్చిన అభ్యర్థుల తలరాత మారిపో­తుందని ఆక్రోశిస్తున్నారు.

మంత్రి సేవలో తరిస్తున్న ఏపీపీఎస్సీ 
కేంద్రంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో పాటు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 315 ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది. 316, 317 నిబంధనల్లో కమిషన్‌ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారమే ఆంధ్ర­ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైంది. 



రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే చైర్మన్‌.. కమిషన్‌లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్‌తోపాటు సభ్యుల్లో సీనియర్‌ను తప్పనిసరిగా నియమించాలి. వీరిద్దరితోపాటు సబ్జెక్టు నిపుణులు, వర్సిటీ వీసీ లేదా ప్రొఫెసర్‌ ఉంటారు. ఒకటికి మించి ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీనియారిటీ ప్రకారం ముందున్న సభ్యుడిని ఆ బోర్డుకు చైర్మన్‌గా నియమిస్తారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఓ మంత్రి సేవలో తరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకటే..
వారం క్రితం గ్రూప్‌–1 ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేస్తూ కమిషన్‌లో ఫైల్‌ పెట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఈనెల 23న ఇంటర్వ్యూలు అనగా ముందు రోజు సీన్‌ మొత్తం మారిపోయింది. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకే ఒక్క బోర్డు ఏర్పాటు చేశారు. ఉన్న సభ్యులను కాదని ఆగమేఘా­లపై కొత్త సభ్యుడిని నియమించారు. 

ఈమేరకు ఆదివారం ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారు. సోమ­వారం రోజు బోర్డులో ఉన్న సీనియర్‌ సభ్యు­డిని హఠాత్తుగా తొలగించి అత్యంత జూనియర్‌ను అప్పటి­కప్పుడు నియమించడంపై పలు అనుమా­నాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇందులో తన ప్రమే­యం ఏదీ లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని దీన్ని ప్రశ్నించిన ఇతర సభ్యుల వద్ద చైర్మన్‌ వాపోయినట్లు తెలిసింది. దీన్నిబట్టి చినబాబు కనుసన్నల్లో ఎంపిక ప్రక్రియ సాగుతున్నట్లు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.


సీనియర్‌ సభ్యులను పక్కనపెట్టి..
టీడీపీ హయాంలో 2015–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరు బోర్డులో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్‌–1 ఇంట­ర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఉదయ్‌ భాస్కర్‌ 2015 నవంబర్‌ 27 తేదీన నియమితులై 2021 నవంబర్‌ 26 వరకు పూర్తి­కాలం కొనసాగారు. 

గతంలో టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల్లో ప్రొఫెసర్‌ జి.రంగజనార్ధన నాలుగేళ్ల ఐదు నెలలు కొనసాగిన అనంతరం జేఎన్‌టీయూ వైస్‌ చాన్సల­ర్‌గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత టీడీపీ సర్కారు నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్‌ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగారు. 

వీరిలో ప్రొఫెసర్‌ పద్మరాజు, విజయకుమార్‌ 2018 గ్రూప్‌–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వ­హిం­చిన ఇంటర్వ్యూలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రొఫెసర్‌ పద్మరాజు సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా ఆరేళ్లు కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా గత ప్రభుత్వంనియమించింది. 

అయితే గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులను ఇప్పుడు  కూటమి ప్రభుత్వం గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరం పెట్టడంతోపాటు ఓ కొత్త సభ్యుడిని నియమించి ఆయనకు అవకాశం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తలరాతలు తారుమారు...
టీడీపీ హయాంలో సర్వీస్‌ కమిషన్‌ తీరు వివాదాల పుట్టగా మారింది. ముఖ్యంగా అప్పట్లో ఉదయ్‌­భాస్కర్‌ చైర్మన్‌గా తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను తల్లకిందులు చేశాయి. ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్‌ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి అధికారి ఒకరు, సబ్జెక్టు నిపుణులు ఒకరు ఉండాలి. కానీ ఇవేవీ పాటించకుండా టీడీపీ ప్రభుత్వం ఒక్క బోర్డునే ఏర్పాటు చేసింది. 

కమిషన్‌ చైర్మన్‌ మాత్రమే ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో తుది మార్కులు వేసేది చైర్మన్‌ కావడంతో అన్నీ తానై చక్కబెట్టినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. గత టీడీపీ ప్రభుత్వంలో డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీ లెక్చరర్‌ పోస్టుల్లో ఆయన ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 

2018 గ్రూప్‌–2 పరీక్షల నిర్వహణ కూడా వివాదాస్పదమైంది. ఇదే రీతిలో ఇప్పుడు గ్రూప్‌–1 ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారనే ఆందోళన రేకెత్తుతోంది. పేలవమైన ప్రశ్నలు.. గత ప్రభుత్వ విధానాలపై స్టేట్‌మెంట్లు ఇస్తూ బోర్డు సభ్యులు రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించడం ఏమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు. టీడీపీ పెద్దల మెప్పు కోసం గ్రూప్‌–1 ఇంటర్వ్యూ బోర్డును రాజకీయ వేదికలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ 2019కి ముందున్న పరిస్థితి తప్పదా? 
వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా సర్వీస్‌ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు బోర్డు సభ్యులు, ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌లు, ఒక సబ్జెక్టు నిపుణుడు  (యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్లు మాత్రమే) ఉండేలా చర్యలు తీసుకుని పారదర్శకంగా వ్యవహరించింది. 2022లో గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. 

సర్వీస్‌ కమిషన్‌ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గతంలో టీడీపీ సర్కారు వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 

2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు గుర్తించగా, గత సర్కారు చొరవతో వివాద రహితంగా ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటిది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వివాదాలకు తెరతీసి మళ్లీ 2019కి ముందున్న పరిస్థితినే తీసుకొస్తోందని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి...
ఇప్పటికే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన సీఎం చంద్రబాబు సర్కారు తమను సైతం వదలడం లేదని గ్రూప్‌–1 ఇంటర్వ్యూ అభ్యర్థులు రగిలిపోతున్నారు. టెన్త్‌ పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడం.. ఆపై మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఘోర వైఫల్యాలు.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ కోసం విద్యార్థుల నుంచి ఏకంగా 66 వేల దరఖాస్తులు రావడం లాంటివి కూటమి సర్కారు నిర్వాకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement