తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్‌ 

AP Sweep in Telangana EAMCET - Sakshi

టాప్‌ ర్యాంకులు ఆంధ్రా విద్యార్థులకే 

ఇంజనీరింగ్, మెడికల్‌ రెండు విభాగాల్లోనూ రాష్ట్ర విద్యార్థులకే మొదటి ర్యాంకులు 

ప్రథమ ర్యాంకులు సాధించిన అనిరుధ్, సత్యరాజ్‌ జశ్వంత్‌ 

ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌లో 8 ర్యాంకులు ఏపీకే 

అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో టాప్‌ టెన్‌లో ఆరుగురికి ర్యాంకులు 

సాక్షి, నెట్‌వర్క్‌: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్‌ విభాగంలోనూ, ఇటు మెడికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ విభాగంలోనూ టాప్‌ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు.

ఇంజనీరింగ్‌ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్‌ జశ్వంత్‌ తెలంగాణ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు.

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్‌ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్‌ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు.  
 
విజేతల అభిప్రాయాలు
వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. 
మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్‌ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం.   – నాసిక వెంకటతేజ, సెకండ్‌ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (అగ్రి అండ్‌ మెడికల్‌ విభాగం) 
 
కార్డియాలజిస్ట్‌ లేదా న్యూరాలజిస్టునవుతా.. 
మాది తెనాలి. నాకు ఇంటర్‌ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్‌ రాశాను. ఎంబీబీఎస్‌ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక.  – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (అగ్రి అండ్‌ మెడికల్‌ విభాగం) 
 
వైద్య రంగంలో స్థిరపడతా.. 
మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక.  – బోర వరుణ్‌ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (అగ్రి అండ్‌ మెడికల్‌ విభాగం)
 

మంచి వైద్య కళాశాలలో మెడిసిన్‌ చేస్తా..  
మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్‌ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ చదవడమే నా లక్ష్యం. – హర్షల్‌సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (అగ్రి అండ్‌ మెడికల్‌ విభాగం) 
 
కష్టపడి చదివా.. 
మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్‌ సాధించాను.  
– సాయి చిది్వలాస్‌రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (అగ్రి అండ్‌ మెడికల్‌ విభాగం) 
 
 కంప్యూటర్స్‌ సైన్స్‌ చదువుతా.. 
మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్‌ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్‌ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం.   – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్‌ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ విభాగం) 
 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం 

మాది ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్‌ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్‌ కేటగిరీలో 263వ ర్యాంక్‌ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్‌ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్‌ వరుణ్, థర్డ్‌ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ విభాగం) 
 
సివిల్స్‌ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం 
మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్‌ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం.   – పొన్నతోట ప్రమోద్‌ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ విభాగం) 
 
ఐఐటీ బాంబేలో చేరతా.. 
మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్‌ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్‌ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ విభాగం) 
 

ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌ చదువుతా.. 
మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్‌ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్‌ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం.  – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ విభాగం) 
 
కంప్యూటర్‌ ఇంజనీర్‌నవుతా.. 
మాది నంద్యాల. ఇంటర్‌ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్‌ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం.   – ప్రిన్స్‌ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ విభాగం)

అడ్వాన్స్‌లోనూ ర్యాంక్‌ సాధిస్తా.. 
మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్‌ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా.  – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌ విభాగం) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top