డీవీ నాయుడు ఎక్కడున్నాడు? | Sakshi
Sakshi News home page

డీవీ నాయుడు ఎక్కడున్నాడు?

Published Wed, Nov 9 2022 8:29 AM

AP Police Searching For DV Naidu In Collector Fake NOC Case - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్‌ అక్రమాలు, నకిలీ ఎన్‌ఓసీ కేసులో కీలకసూత్రధారి డీవీ నాయుడు గురించి ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ఆరా తీశారు. మంగళవారం ఉదయం సెల్‌ కాన్ఫరెన్స్‌లో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్పతో ఎస్పీ మాట్లాడారు. న్యాయవాదులకు అందుబాటులో ఉన్న డీవీ నాయుడు మీకు మాత్రం కనిపించకుండా పోవడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. 

పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక 
ఈ కేసులో నిందితులైన మనోజ్‌ను అక్టోబర్‌ 17న, ఫిర్యాదుదారుల్లో ఒకరైన శ్రీనివాసులును అదే నెల 18న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో ఫిర్యాదిదారి, కేసులో కీలకసూత్రధారి అయిన డీవీ నాయుడు జిల్లాను వీడి బెంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లాడు. ఈ విషయాన్ని నాయుడు తనకు సన్నిహితంగా ఉన్న సమీప బంధువొకరికి చేరవేశాడు. సదరు సమీప బంధువు రెండు రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి జిల్లాలో జరుగుతున్న విషయాలను వివరించి తిరిగి వచ్చాడు. ఆ వెళ్లి వచ్చిన సన్నిహితుడెవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఇదిలా ఉండగా అనంతపురానికి చెందిన మీడియా ప్రతినిధి ఒకరు ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్‌ చేసి ‘డీవీ నాయుడు తప్పేమీ లేదు’ అని చెప్పినట్లు సమాచారం. ఆ మీడియా ప్రతినిధికి డీవీ నాయుడు గురించి తెలిసే ఉంటుందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. మరో రెండు రోజుల్లో డీవీ నాయుడు శ్రీలంక నుంచి రావాల్సి ఉంది. వీసా గడువు ముగుస్తుండటంతో అతను బెంగళూరు, ఢిల్లీ మినహా మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం లేదు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా పట్టుకోవాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. 

Advertisement
Advertisement