
రెంటపాళ్ల వద్ద వృద్ధుడిని చితకబాదుతున్న పోలీసులు, రెంటపాళ్లకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో పోలీసుల ‘పచ్చ’పాతం
సాక్షి, నరసరావుపేట/పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ప్రజల భద్రత కోసం పని చేయాల్సిన పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రతిపక్ష నేతలపై కక్ష తీర్చుకోవడానికే ఉపయోగిస్తోంది. ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో ఆయనకు భద్రత కలిగించాల్సింది పోయి.. అడుగడుగునా ఆంక్షలు విధించి పర్యటనను విఫలం చేసే కుట్రలో పోలీసు వ్యవస్థ నిమగ్నమవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది.
రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రతి దశలో ‘పచ్చ’పాత వైఖరి అవలంబించి విమర్శలపాలయ్యారు. భద్రత పేరుతో ముగ్గురు ఎస్పీలు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 554 మంది సిబ్బందిని విధుల్లో నియమించినప్పటికీ, వీరంతా వైఎస్ జగన్ భద్రత∙కోసం కాకుండా నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఎక్కడికక్కడ నిలువరించేందుకే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్ జగన్ ఇటీవల పర్యటించిన తెనాలి, పొదిలి, రాప్తాడు పర్యటనలకు ప్రజలు బ్రహ్మారథం పట్టడంతో ఎలాగైనా రెంటపాళ్ల పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం, పోలీసులు కుట్రలు పన్నారు. అనుమతులు ఇవ్వలేమంటూ హైడ్రామా సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విచిత్ర నిబంధనలు అడ్డుచూపి ఆంక్షలు పెట్టారు. మంగళవారం రాత్రి కూడా సత్తెనపల్లిలో పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రెస్మీట్ పెట్టి అనుమతులపై స్పష్టత లేకుండా మాట్లాడారు.
మరోవైపు జగన్ పర్యటనలో పాల్గొనవద్దంటూ గుంటూరు, పల్నాడు జిల్లా పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి పార్టీ నేతలకు నోటీసులు అందజేశారు. ఒకవేళ వెళితే కేసులు బనాయించి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. రెంటపాళ్లకు ప్రైవేట్ వాహనాలు పంపొద్దని, పంపితే సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి, బుధవారం తెల్లవారుజాము నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు.
మాచర్ల, గుంటూరు, నరసరావుపేట, అమరావతి మొదలైన ప్రాంతాల నుంచి వస్తున్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అడ్డుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను సైతం పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారుల ఆధార్ కార్డులు చెక్ చేసి మరీ పంపారు. దీంతో కొంత మంది రోడ్డు మార్గాన్ని వదలి పంట పొలాల మీదుగా ద్విచక్ర వాహనాల్లో రెంటపాళ్లకు చేరుకున్నారు.
ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తుదకు విగ్రహావిష్కరణకు వస్తున్న బంధువులను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారని నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు వాపోయారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణలు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. గుంటూరు నగరంలోనూ పోలీసులు అదే తీరు ప్రదర్శించారు.