డీలర్‌షిప్‌ రద్దుకు ముందు విచారణ జరపాల్సిందే | AP High Court key verdict On ration depot dealerships Cancellation | Sakshi
Sakshi News home page

డీలర్‌షిప్‌ రద్దుకు ముందు విచారణ జరపాల్సిందే

Apr 15 2025 5:27 AM | Updated on Apr 15 2025 5:29 AM

AP High Court key verdict On ration depot dealerships Cancellation

వాదన వినిపించే అవకాశం డీలర్‌కు ఇవ్వాలి 

డీలర్‌ సమక్షంలో ఫిర్యాదుదారులను విచారించాలి 

రేషన్‌ డిపో డీలర్‌షిప్పుల రద్దుపై హైకోర్టు కీలక తీర్పు 

చిత్తూరు కలెక్టర్, జేసీ,  మదనపల్లి ఆర్‌డీవో ఉత్తర్వుల రద్దు

సాక్షి, అమరావతి: చౌక ధరల దుకాణ డీలర్‌షిప్‌లను అధికారులు ఏకపక్షంగా రద్దు చేస్తున్న నేపథ్యంలో.. ఇందుకు అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. డీలర్‌షిప్‌ రద్దు వల్ల డీలర్‌ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారని, అందువల్ల తగిన విచారణ జరిపిన తరువాతే డీలర్‌షిప్‌ రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వ్యక్తిగతంగా వాదన వినిపించే అవకాశం డీలర్‌కు ఇవ్వాలంది. అలాగే డీలర్‌తో పాటు ఒకవేళ సాక్షులు ఉంటే వారి ప్రమాణపూర్వక వాంగ్మూలాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. కార్డుదారులు గానీ, ఇతరులెవరైనా గానీ ఫిర్యాదు చేస్తే డీలర్‌ సమక్షంలో వారిని కూడా విచారించాలంది. 

ఆ వ్యక్తులకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశం కూడా ఇవ్వాలని అధికారులకు తేల్చి చెప్పింది. ఏ ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారో ఆ నివేదికలన్నింటినీ డీలర్‌కు అందచేయాలంది. ఎలాంటి విచారణ జరపకుండా తహసీల్దార్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీలర్‌షిప్‌ రద్దు చేస్తూ ఆర్‌డీవో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. కనీసం డీలర్‌ ఇచ్చిన వివరణను కూడా కనీస స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. తహసీల్దార్‌ తయారు చేసిన నివేదికను డీలర్‌కు అందచేయలేదని తెలిపింది. అలాగే డీలర్, సాక్షుల ప్రమాణపూర్వక వాంగ్మూలాలను కూడా నమోదు చేయలేదంది. 

ఆర్‌డీవో ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంది. వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వాటిని సమర్థిస్తూ జాయింట్‌ కలెక్టర్, కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తిరిగి ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆర్‌డీవోను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

డీలర్‌షిప్‌ రద్దుపై న్యాయ పోరాటం 
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎం.అరుణకు చెందిన రేషన్‌ డీలర్‌షిప్‌ను రద్దు చేస్తూ మదనపల్లి ఆర్‌డీవో 2009 ఫిబ్రవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సమర్థిస్తూ జాయింట్‌ కలెక్టర్‌ 2009 ఫిబ్రవరి 20న ఉత్తర్వులిచ్చారు. వీటిని సమర్థిస్తూ 2013 ఫిబ్రవరి 10న కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అరుణ 2013లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ జడ్జి తుది విచారణ జరిపి పిటిషన్‌ను కొట్టేస్తూ 2024 జూలై 16న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అరు­ణ ధర్మాసనం ఎదుట అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధా­న న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఆర్‌డీవో, జాయింట్‌ కలెక్టర్, కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement