ఉన్నత విద్యా రంగంపై సీఎం జగన్ సమీక్ష 

AP CM YS Jagan Review On Higher Education - Sakshi

సాక్షి, అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ‘ఉన్నత విద్యా రంగంలో నూతన విద్యా విధానం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం–2020లో ఏం ప్రస్తావించారు? రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? వంటి అన్ని అంశాలపై సమావేశంలో అధికారులు వివరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌–రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మూడేళ్లలో ప్రమాణాలు:
సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీలు వచ్చే 3 ఏళ్లలో నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏసీ–న్యాక్‌) సర్టిఫికెట్లు సాధించాలన్నారు. అన్ని ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా ఆ గుర్తింపు పొందాలని పేర్కొన్నారు. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్‌తో సహా, అన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. మూడేళ్లలో కాలేజీల్లో మార్పు రాకపోతే, చర్యలు తప్పవని చెప్పాలన్నారు. ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియట్‌ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ప్రత్యేక బృందాలు–తనిఖీలు:
‘‘బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలి. టీచర్‌ ట్రెయినింగ్‌ సంస్థల్లో క్వాలిటీ లేకపోతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. టీచర్ల శిక్షణలోనే నాణ్యత లేకపోతే వారు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు?. కాలేజీలలో ప్రమాణాలు, నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ ఖరారు చేసుకోండి. బృందానికి ముగ్గురు చొప్పున 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. వారు అన్ని కాలేజీలలో తనిఖీలు నిర్వహించాలి. వారు శాశ్వత స్వా్కడ్‌ మాదిరిగా ఉండాలి. వారి పనితీరులో పారదర్శకత కోసం వారిని రొటేట్‌ చేస్తూ ఉండాలి. ప్రమాణాలు, నాణ్యత లేని కాలేజీలకు కొంత సమయం ఇచ్చి వాటిని మార్చుకోమని చెప్పాలి. ఈ తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని’’ సీఎం పేర్కొన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

డిగ్రీ. పీజీ కోర్సుల్లో మార్పులు:
ఇక మీద రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు
అదే విధంగా మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు
ఈ ఏడాది నుంచే అవి ప్రారంభం
4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్‌డీ అడ్మిషన్లు.
వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్స్‌
అదే విధంగా వచ్చే ఏడాది నుంచి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్ప్‌

అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో కోర్సులు:
విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో కోర్సులు రూపొందించాలి.
ఆ దిశలో విద్యార్థులు చదివేలా కృషి చేయాలి.
రొబొటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, డేటా అనలటిక్స్‌ వంటి కొత్త కోర్సులు ప్రారంభించాలి.
ఇంకా బికామ్‌లో సెక్యూరిటీ (స్టాక్‌) అనాలిసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలు కూడా ఉండాలి.

అటానమస్‌ కాలేజీలు పెరగాలి:
రాష్ట్రంలో దాదాపు 3 వేల కాలేజీలు ఉండగా, వాటిలో కేవలం 104 మాత్రమే అటానమస్‌గా పని చేస్తున్నాయి.
కాబట్టి వీటి సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంది.
జాతీయ అక్రిడిటేషన్‌ సంస్థలతో అనుబంధంగా రాష్ట్రంలో కూడా అక్రిడిటేషన్‌ విభాగాన్ని తయారు చేయాలి.
విద్యా సంస్థలను అన్నింటినీ కూడా అక్రిడిటేషన్‌ వైపు నడిపించాలి.
విజయనగరం, ఒంగోలులో కొత్తగా యూనివర్సిటీలు
విజయనగరంలో ఇంజనీరింగ్‌ విద్య ఫోకస్‌గా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ.
టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఫోకస్‌గా ఒంగోలు యూనివర్సిటీ.

కాగా, కాలేజీలలో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్న అధికారులు 200కు పైగా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు సమావేశంలో తెలిపారు. నిర్ణీత సమయంలోగా వాటిలో మార్పు రాకపోతే, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top