ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్‌.. | Sakshi
Sakshi News home page

ఏపీ బంద్‌: డిపోలకే పరిమితమైన బస్సులు

Published Fri, Mar 5 2021 7:07 AM

AP Bandh Over Privatisation Of Visakha Steel Plant - Sakshi

విశాఖపట్నం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు  విజయసాయిరెడ్డి,  ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌,  కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు. మద్దిలపాలెం బస్‌ స్టాండ్‌ వద్ద బస్సులు నిలిపివేశారు. నిరసనలో  ప్రజాసంఘాల జేఏసీ, సీఐటీయూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ నరసింగరావు పాల్గొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు‌ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

టీడీపీ డ్రామాల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి
ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పోరాటం చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరిస్తే లాభాలు వస్తాయని చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైఎస్సార్‌ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన పది రోజులకు.. చంద్రబాబు స్పందించి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అంటేనే డ్రామాల పార్టీ అని, ఆయన కుమారుడు పప్పునాయుడని ఆయన విమర్శలు గుప్పించారు.

నిలిచిన జ‌న‌ సంచారం..
తూర్పుగోదావరి: 
విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌యివేటీక‌ర‌ణ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపును ఇవ్వ‌డంతో కాకినాడలో బంద్  ప్ర‌భావం క‌నిపించింది. అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌తో స‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్ర‌జా సంఘాలు ఈ బంద్‌కి సంఘీభావం తెలిపాయి. జెఎన్‌టీయూలో నేడు జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసారు. కాకినాడ సీపోర్ట్ లో కార్మికులు బంద్ ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డి కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థ‌లు, దుకాణాలు, సినిమా హాల్స్ మూత ప‌డ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోల‌కే ప‌రిమితం అయ్యాయి.  ట్రావెల్స్, ఆటో డ్రైవ‌ర్ లు కూడా బంద్ పాటిస్తుండ‌టంతో జ‌న‌ సంచారం నిలిచిపోయింది.

కార్మిక సంఘాల నిరసన..
విజయవాడ: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌లో బంద్‌ కొనసాగుతుంది. రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల నిరసనతో  బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. బంద్‌లో వైఎస్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.

స్తంభించిన రవాణా..
కృష్ణా: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌ కొనసాగుతుంది. మచిలీపట్నంలో డిపోలకే  ఆర్టీసీ బస్సులు పరిమితయ్యాయి. రవాణా స్తంభించింది. స్వచ్ఛందంగా దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌కు సంఘీభావం తెలిపాయి.

వామపక్షాల భారీ ర్యాలీ
అనంతపురం: నగరంలో వామపక్షాల భారీ ర్యాలీ నిర్వహించాయి. విశాఖ ఉక్కును ప్రవేటీకరించొద్దని డిమాండ్ చేశాయి. బంద్‌కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కమ్యూనిస్టు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి:
చంద్రబాబుకు చుక్కలు చూపించిన న్యాయవాదులు 
ఏక కాలంలో అంగన్‌వాడీ భవనాల పనులు 
 


Advertisement
Advertisement