ఢిల్లీ: విశాఖ స్టీల్ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై ఏపీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. సుమోటో కేసుగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. గాయపడినవారి ఆరోగ్య స్థితి, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వివరాలు అందించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చికిత్స పొందుతున్న పైడిరాజు నిన్న (బుధవారం) ఉదయం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో గత సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. కాగా, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించలేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


