అభిప్రాయం
జూన్ 8, 2026న విశాఖ స్టీల్ ప్లాంట్ (ఎస్ఎమ్ఎస్–1)లో 1,500 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ద్రవరూప ఉక్కు చిందిపడటం వల్ల ఇప్పటివరకు 9 మంది మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రైవేటీకరణను తాత్కాలికంగా ఆపామని చెప్తున్న ప్రభుత్వం, అంతర్గతంగా ప్లాంట్ను బలహీనపరుస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న విషయం ప్రమాద కారణాన్ని స్పష్టం చేస్తోంది. ‘గత కొన్నేళ్లుగా కొత్త నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. కేవలం 8,800 మంది కార్మికులతో రోజుకు 18,000 టన్నుల ఉత్పత్తి చేయిస్తూ తీవ్రమైన పని ఒత్తిడికి గురిచేస్తున్నారు. అనుభవం లేని సిబ్బందితో ప్రమాదకరమైన పనులు చేయించడం వల్లే ఇందరు ప్రాణాలు అన్యాయంగా కోల్పోయా’రని కార్మికులు అంటున్నారు.
పరిపాలనా వైఫల్యం
ఈ ఘోర ప్రమాదం కేవలం ఒక పారిశ్రామిక ప్రమాదంగా చూడదగినది కాదు. ఇది దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమల భవిష్యత్తు, కార్మికుల భద్రత, పాలనలో బాధ్యత, రాజ్యాంగ నైతికత వంటి ప్రశ్నలను లేవనెత్తుతున్న విషాద సంఘటన. దీని వెనుక విధానపరమైన నిర్లక్ష్యం ఉందా అన్నది చర్చనీయాంశం. ఉక్కు తయారీ ప్రక్రియలో స్టీల్ మెల్టింగ్ షాప్ అత్యంత కీలకమైన విభాగం. దాదాపు 1,500 నుంచి 1,600 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న ఉక్కును శుద్ధి చేసి తదు పరి దశలకు తరలిస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి భద్రతా ప్రమాణం తప్పనిసరిగా అమలు కావాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, నాణ్యత తనిఖీలు, ముడి పదార్థాల పరిశీలన, పరికరాల నిర్వహణ, భద్రతా కవర్లు, అత్యవసర నియంత్రణ వ్యవస్థలు, ఇవన్నీ కేవలం నియమాలు కాదు; అవి ప్రాణరక్షణ సాధనాలు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన లాడిల్కు తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా కవర్ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్జింగ్ ప్రక్రియకు అవసరమైన పరికరాల కొరత ఉందనే వాదనలు వస్తున్నాయి. ఇవన్నీ నిజమైతే, ఈ ప్రమాదం కేవలం సాంకేతిక వైఫల్యం కాదు; అది పరిపాలనా వైఫల్యమే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి జీవించే హక్కును హామీ ఇస్తుంది. ఒక కార్మికుడు ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం సురక్షితంగా తన కుటుంబం వద్దకు చేరుకొనే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాల, యాజమాన్యాల ప్రాథమిక బాధ్యత. ఉక్కును తయారు చేసే భట్టీల కంటే వేడిగా మండేది కార్మికుడి చమట. ఆ చమటను గౌరవించని వ్యవస్థ చివరికి తన నైతిక హక్కును కోల్పో తుంది. చట్టపరంగా ఇది నేరుగా ఉద్దేశపూర్వక హత్య కాకపోయి నప్పటికీ, కార్మికుల మరణానికి కారణమైన పాలకుల, అధికారుల బాధ్యతారాహిత్య వైఖరి కచ్చితంగా శిక్షార్హమైన నేరమే. పరిశ్రమల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోకుండా, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదకరమైన పనులు చేయించి మరణాలకు కారణమైతే, బీఎన్ఎస్లోని రెండు సెక్షన్లు వర్తిస్తాయి. ఇందులో బీఎన్ఎస్ సెక్షన్ 106(1) ఒకటి. ర్యాష్ లేదా నిర్లక్ష్యపూరితమైన చర్య వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఈ సెక్షన్ వర్తిస్తుంది. కనీస రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం, 6,000 మంది అనుభవజ్ఞులైన కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, తక్కువ సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి తీసుకురావడం, సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వంటివి ‘నేరపూరిత నిర్లక్ష్యం’ కిందికే వస్తాయి.
శిక్షలో ఒక పెద్ద మార్పు ఉంది. పాత ఐపీసీ 304ఎ కింద గరిష్ఠంగా కేవలం 2 ఏళ్ల జైలు శిక్షమాత్రమే ఉండేది. కానీ కొత్త బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద 5 ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా పెంచారు. బీఎన్ఎస్ సెక్షన్ 105 మరొకటి. ఇది హత్యానేరం కాని నేరపూరిత నరహత్యకు సంబంధించింది. ముందస్తు ఆలోచన లేకుండా ఒక మనిషిని చట్ట విరుద్ధంగా చంపడం. దీని ప్రకారం ప్రమాదవశాత్తు జరిగిన మరణ మైనా, ఉద్దేశపూర్వక హత్య అయినా కారకులు శిక్షార్హులే. 1,500 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉన్న ద్రవరూప ఉక్కుతో పనిచేసే బ్లాస్ట్ ఫర్నెస్ వద్ద తగినంత మంది నిపుణులు లేకపోతే విస్ఫోటనం జరిగి ప్రాణాలు పోతాయని యాజమాన్యానికి స్పష్టమైన సాంకేతిక పరిజ్ఞానం/జ్ఞానం ఉంటుంది. అటువంటి విషయం తెలిసి కూడా కేవలం ఉత్పత్తి పెంచడం కోసం, ఖర్చులు తగ్గించుకోవడం కోసం భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. దానికి శిక్ష 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా.
తెలియదని తప్పించుకోలేరు!
సుశీల్ అన్సాల్ వర్సెస్ స్టేట్ త్రూ సీబీఐ (ఉపహార్ సినిమా థియేటర్ దురంతం) కేసులో సుప్రీంకోర్టు ‘‘లాభాల కోసం భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టడం అనేది కేవలం సివిల్ తప్పు కాదు, అది సమాజానికి వ్యతిరేకంగా చేసే నేరపూరిత చర్య. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే, ఆ సంస్థ అధినేతలు ‘మాకు ప్రత్యక్షంగా సంబంధం లేదు’ అని తప్పించుకోలేరు’’ అని పేర్కొంది. భోపాల్ గ్యాస్ దురంతం కేసు పరిణామాలు–తాజా పారిశ్రా మిక తీర్పులను పరిశీలించినా విశాఖ ప్రమాద కారకులు శిక్షార్హులే. ఫ్యాక్టరీలలో జరిగిన బాయిలర్ పేలుళ్లు, గ్యాస్ లీకేజీలపై సుప్రీంకోర్టు‘అబ్సల్యూట్ లయబిలిటీ’ (సంపూర్ణ బాధ్యత) సూత్రాన్ని వర్తింపజేస్తోంది. దీని ప్రకారం, ఒక ప్రమాదకరమైన పరిశ్రమను నడుపుతున్నప్పుడు, అందులో జరిగే ఏ నష్టానికైనా, మరణానికైనా యాజమాన్యమే సంపూర్ణ బాధ్యత వహించాలి. ‘మాకు తెలియకుండా జరిగింది’ అనే వాదనలు కోర్టుల్లో చెల్లవు. విశాఖ ఉక్కు ప్లాంట్లో జరిగిన అన్యాయ మరణాలు పాలనా పరమైన, నిర్వహణాపరమైన వైఫల్యాల వల్ల జరిగినవే కాబట్టి, బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి విచారించవచ్చు.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్


