సాక్షి, కృష్ణా: ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. తాజాగా రావణ్పై గన్నవరం పోలీసు స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
వివరాల ప్రకారం.. యలమంచిలి కోర్టు నిన్న(శనివారం) రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, బెయిల్ వచ్చిన కాసేపటికే వేంపాడు టోల్ప్లాజా వద్ద పోలీసులు రావణ్ను మళ్లీ అరెస్ట్ చేశారు. జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ నిన్న రావణ్పై గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విశేషం.
దీంతో, హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అర్ధరాత్రి రావణ్ను గన్నవరం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు.. స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించన లేదు. అనంతరం, గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే, రావణ్ను మొదట ఏలూరు తీసుకువెళతారని ప్రచారం జరిగినప్పటికీ అర్ధరాత్రి గన్నవరం స్టేషన్కి తీసుకువచ్చారు.
అయితే, శివశంకర్ ఫిర్యాదుతో రావణ్పై రాజద్రోహం కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద U/s 147,148,152,192,197(1)(d),353(1)(b) & Sec 13, 39 of Unlawful Activity Prevention Act 1967 (UAPA Act) కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దేశసార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపధ్యంలో కేసు నమోదు చేశారు.


