వచ్చే నెల 10న కలెక్టరేట్ల వద్ద ఆందోళనలను జయప్రదం చేయండి
అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ పిలుపు
కనీస వేతనాలు ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్
సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. జూలై 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలను విజయవంతం చేయాలని కోరారు. విజయవాడలో ఆదివారం యూనియన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి అధ్యక్షతన అంగన్వాడీల రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం సుబ్బరావమ్మ మీడియాతో మాట్లాడుతూ..అంగన్వాడీలకు కనీస వేతనమివ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఐసీడీఎస్కు నిధులు తగ్గించి లబ్ధిదారులకు ఫీడింగ్ సక్రమంగా అందకుండా చేస్తోందన్నారు. అనేక రకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీలపై పనిభారం పెంచి ప్రీసూ్కల్ జరగనివ్వకుండా చేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు ఏడాదికి 10 శాతానికి పైగా పెరుగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. బాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తోందని, పారిశ్రామికవేత్తలకు 99పైసలకే భూములను ధారాదత్తం చేస్తోందని, అంగన్వాడీల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు.


