
వైఎస్ జగన్ హయాంలో జీఎస్టీ రూ.25,331 కోట్ల నుంచి రూ.44,298 కోట్లకు పెరుగుదల
కోవిడ్ తర్వాత ఏటా రెండంకెల వృద్ధి నమోదు
చంద్రబాబు ప్రభుత్వంలో తగ్గిపోయిన జీఎస్టీ ఆదాయం
గతేడాది వృద్ధి 1.2 శాతానికే పరిమితం
ఈ ఏడాది ఏప్రిల్లో 3.6 శాతం, మే నెలలో 2.24 శాతం తగ్గుదల
స్టేట్ ట్యాక్స్ కమిషనర్ ఎ.బాబు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసిన జీఎస్టీ ఆ తర్వాత గణనీయంగా పడిపోయిందని స్టేట్ ట్యాక్స్ కమిషనర్ ఎ.బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో గణాంకాలతో సహా వివరించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.25,331.43 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు.. వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.44,298.36 కోట్లకు పెరిగాయి.
అంటే కోవిడ్ వంటి మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్తో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయినా గడచిన ఐదేళ్లలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం అదనంగా రూ.18,966.57 కోట్లు పెరిగింది. అంటే ఏటా సగటున 14.97 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. కోవిడ్ తర్వాత వరుసగా మూడేళ్లు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2021–22లో 25 శాతం, 2022–23లో 23 శాతం, 2024–25లో 10.1 శాతం వృద్ధి నమోదైనట్టు ఎ.బాబు వివరించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూస్తోందని.. 2024–25లో రాష్ట్ర స్థూల జీఎస్టీ ఆదాయం కేవలం 1.2 శాతం వృద్ధితో రూ.44,824.51 కోట్లకే పరిమితమైందని ఎ.బాబు పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుత కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఏప్రిల్ నెలలో జీఎస్టీ ఆదాయం 3.36 శాతం తగ్గి రూ.4,686 కోట్లకు, మే నెలలో 2.24 శాతం తగ్గి రూ.3,803 కోట్లకు పరిమితమైందని పేర్కొన్నారు. ఒకపక్క జీఎస్టీ ఆదాయం పడిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. కిందపడ్డా మాదే పైచేయి అన్న చందంగా రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయంటూ పత్రికా ప్రకటన ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

గత ప్రభుత్వం హయాంలో రెండంకెల వృద్ధి రేటు నమోదవడానికి కోవిడ్ కారణంగా రిటర్న్లు దాఖలు చేయడానికి వ్యాపారులకు గడువు పెంచరాదని, దీంతో భారీ వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. 2024–25లో ఆమ్నెస్టీ స్కీం అమలు చేయడం, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ లేకపోవడం కారణమని పేర్కొన్నారు. 2017–18 నుంచి 2019–20 వరకు లేవనెత్తిన డిమాండ్లపై వడ్డీని మాఫీ చేస్తూ పాత బకాయిలు చెల్లించడానికి అనుమతించడం ద్వారా అదనపు ఆదాయం రావడం, ఆమ్నెస్టీ స్కీం అమలు చేయడం వల్లే 2024–25లో 1.2 శాతం వృద్ధి నమోదైందని జీఎస్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
