కోవిడ్‌ కట్టడిలో ఏపీ భేష్‌

Andhra Pradesh Good In Covid Prevention - Sakshi

15–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌లో ముందంజ

మొదటి డోస్‌ 100 శాతం పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌

ప్రధాని వర్చువల్‌ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణ, నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసించింది. ముఖ్యంగా 15–18 ఏళ్ల వయస్సు వారికి అత్యధికంగా వ్యాక్సినేషన్‌ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని పేర్కొంది. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ వారు వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు. యువతకు అధికంగా వ్యాక్సిన్‌ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉండటంతో పాటు మొదటి డోస్‌ 100 శాతం పూర్తి చేసిన రాష్ట్రాల్లో కూడా ఏపీ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆ ప్రజెంటేషన్లో పేర్కొంది.

థర్డ్‌వేవ్‌ అధికంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత ప్రధాన మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top