
సాక్షి, ఆళ్లగడ్డ: నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు ప్రైవేటు ట్రావెట్స్ బస్సులు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మార్గ మధ్యలో ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఇద్దరు, మరో ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. మరణించిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.