స్టీల్‌ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకారం | All kinds of support to steel plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకారం

Jul 12 2024 5:46 AM | Updated on Jul 12 2024 5:46 AM

All kinds of support to steel plant

కేంద్ర భారీ, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని పలు విభాగాలను సందర్శించిన కేంద్ర మంత్రి

ప్లాంట్‌ సీఎండీ, డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులతో సమీక్ష 

ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర భారీ, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసశర్మ తదితరులతో కలిసి గురువారం ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాలను సందర్శించారు. మొదట ఈడీ(బిలి్డంగ్‌)లోని మోడల్‌ రూమ్‌ను సందర్శించారు. అక్కడ సీఎండీ అతుల్‌ భట్‌ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి ప్రక్రియ, ముడి పదార్థాల సరఫరా, ఉత్పత్తుల రవాణా తది­తర అంశాలను వివరించారు. అక్కడే ఉన్న అవార్డు గ్యాలరీకి వెళ్లి స్టీల్‌ప్లాంట్‌ సాధించిన అవార్డులను పరిశీలించారు. 

కార్యక్రమంలో భాగంగా ఆయన కోక్‌ ఓవెన్స్, బ్లాస్ట్‌ఫర్నేస్‌–3, ఎస్‌ఎంఎస్‌–2, వైర్‌ రాడ్‌ మిల్‌–2 విభాగాలను సందర్శించారు. అనంతరం ఉక్కు పరిపాలన భవనంలో సీఎండీ, డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులతో స్టీల్‌ప్లాంట్‌ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్‌కు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి సంజయ్‌ రాయ్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు, సెయిల్‌ డైరెక్టర్‌ కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు.  

ఆందోళన వద్దు
ఆయన సందర్శన పుసక్తంలో ఇలా రాశారు ‘ఈ స్టీల్‌ప్లాంట్‌ సందర్శించాక దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ ప్లాంట్‌ సహాయపడుతుందని నాకు అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్‌పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్‌ను రక్షించడం నా బాధ్యత. ప్లాంట్‌ మూతపడుతుందని  ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రధాని ఆశీస్సులు, సాయంతో ప్లాంట్‌ నూరు శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది’ అని రాశారు.  

ప్రధానితో చర్చించాకే నిర్ణయం  
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని  మంత్రి హెచ్‌డీ కుమారస్వామి  చెప్పా రు.  ఇందుకు తమకు రెండు నెలలు వ్యవధి అవసరమన్నారు. అయితే ప్రైవేటీకరణ రద్దుపై కుమారస్వామి పూర్తి భరోసా ఇవ్వకపోవడంతో కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement