పిల్లలకు వె'డర్'! | Air pollution has a serious impact on children | Sakshi
Sakshi News home page

పిల్లలకు వె'డర్'!

Nov 25 2024 5:20 AM | Updated on Nov 25 2024 5:20 AM

Air pollution has a serious impact on children

బాలలపై తీవ్ర ప్రభావం చూపనున్న వాతావరణ కాలుష్యం

2050 నాటికి దేశంలో పిల్లల జనాభా 10.6 కోట్ల మేర తగ్గే అవకాశం

జీవనోపాధులపై ప్రతికూల ప్రభావం, ప్రకృతి విపత్తులే కారణం 

యునిసెఫ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ చిల్డ్రన్‌ నివేదికలో వెల్లడి

చిల్డ్రన్‌ క్లెయిమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 26వ స్థానం

సాక్షి, అమరావతి: వాతావరణంలో తీవ్రంగా పెరుగుతున్న గాలి కాలుష్యంతోపాటు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు పిల్లల జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌(యునిసెఫ్‌) వెల్లడించింది. మన దేశంలో 2050 నాటికి పిల్లల సంఖ్య 10.60 కోట్ల మేర తగ్గుతుందని హెచ్చరించింది. వాతావరణంలో మార్పుల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు తక్కువ ఆదాయ వర్గాల జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. 

అదేవిధంగా వరదలు వంటి ప్రకృతి విపత్తుల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొంది. వీటివల్ల పిల్లల సంఖ్య తగ్గుతుందని, 2050 నాటికి దేశ జనాభాలో సుమారు 45.6 కోట్లు ఉండాల్సిన బాలలు... కేవలం 35 కోట్లు మాత్రమే ఉంటారని వివరించింది. అయినా 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం పిల్లల జనాభాలో భారతదేశ వాటా 15శాతం ఉంటుందని అంచనా వేసింది. 

యునిసెఫ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ చిల్డ్రన్‌–2024 నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది పిల్లలు ఉంటారని, వారిలో మూడో వంతు భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్‌ దేశాల్లోనే ఉంటారని ప్రకటించింది. 

కొన్ని దేశాల్లో ప్రతి పది మందిలో ఒక్కరు కూడా పిల్లలు ఉండని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2050–59 మధ్య పర్యావరణ సంక్షోభాలు మరింత ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందని, ఇవి పిల్లల జనాభాపై అత్యంత తీవ్రంగా ప్రభావం చూపుతాయని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది.

యునిసెఫ్‌ నివేదికలోని ముఖ్యాంశాలు..
» ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన 28 దేశాల్లో కుటుంబ ఆదాయాల పరంగా పిల్లల జనాభాలో మార్పులను అంచనా వేశా­రు. 2000 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం పిల్లల జనాభాలో 11 శాతం మంది తక్కువ ఆదాయం కలిగిన  28 దేశాల్లోనే ఉండగా... 2024 నాటికి 23 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఉన్నత, మధ్యస్థ ఆదాయా­లు కలిగిన దేశాల్లో పిల్లల జనాభా తగ్గింది.
»   ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో 2000వ సంవత్సరంలో 24 కోట్ల మంది పిల్లలు ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 54.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. దిగువ మధ్య తరగతి ఆదాయ కుటుంబాల్లో 100.09 కోట్ల మంది ఉండగా, 2050 నాటికి స్పల్పంగా పెరిగి 118.70 కోట్లకు చేరుతుంది. 
»    ఉన్నత, మధ్య ఆదాయ కుటుంబాల్లో 2000లో 65 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, 2050 నాటికి ఆ సంఖ్య బాగా తగ్గి 38.70 కోట్లకు పరిమితమవుతుంది. ధనిక కుటుంబాల్లో 2000 నాటికి 24.40 కోట్ల మంది పిల్లల జనాభా ఉండగా, ఆ సంఖ్య 2050 నాటికి 21.60 కోట్లకు పరిమితమవుతుంది. 
»   అదేవిధంగా పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు 57 అంశాల అమలుపై 163 దేశాల్లో యునిసెఫ్‌ అధ్యయనం చేసి ప్రకటించిన చిల్డ్రన్‌ క్లెయిమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌లో భారత్‌ 26వ స్థానంలో ఉంది.   

Advertisement
 
Advertisement
Advertisement