
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 2022 జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్డ్స్ రిజర్వేషన్ను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ ఆ నాలుగు రోజులు తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.
► ఎమ్బీసీ–34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ కౌంటర్, ఏఆర్పీ కౌంటర్లలో 2022 జనవరి 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయించబడవు.
► జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపులో ఎలాంటి ప్రివిలేజ్ వర్తించదు.
► శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకటకళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్మెంట్ కౌంటర్లు ఏర్పాటుచేసి గదులు కేటాయిస్తారు.
► స్వయంగా వచ్చిన ప్రముఖులకు గరిష్టంగా 2 గదులు మాత్రమే కేటాయిస్తారు.
► సామాన్య భక్తులకు సీఆర్వో జనరల్ కౌంటర్ ద్వారా గదులు మంజూరు చేస్తారు.