వీరజవాను కుటుంబానికి రూ.50 లక్షలు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని  అందజేసిన ఎంపీ మిథున్‌రెడ్డి

Published Wed, Nov 24 2021 4:40 AM

50 Lakh Cheque Handed Over By MP Mithun Reddy To jawan karthik Kumar Reddy Family - Sakshi

మదనపల్లె సిటీ: హిమాచల్‌ప్రదేశ్‌లో దేశరక్షణ విధులు నిర్వర్తిస్తూ ఈనెల 4వ తేదీన మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి త్యాగం మరువలేమని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి మదనపల్లెలోని తన కార్యాలయంలో వీర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషాల సమక్షంలో అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన జవాను ఆవుల కార్తీక్‌కుమార్‌రెడ్డి మరణవార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారన్నారు. తక్షణం వారి కుటుంబానికి అండగా నిలవాలని తమను ఆదేశించారని తెలిపారు. వీరజవాను తల్లి సరోజమ్మ మాట్లాడుతూ తన కుమారుడు దేశసేవలో అమరుడు కావడం గర్వంగా ఉందన్నారు.

తమ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎండీసీ చైర్మన్‌ షమీమ్‌అస్లాం, జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు జింకా చలపతి, నూర్‌ఆజం, స్థానిక నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, దండు శేఖర్‌రెడ్డి, మౌళి, రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.   

Advertisement
Advertisement