విశాఖపట్నం: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు.. సరిగ్గా ఇలాంటి వినూత్న దృశ్యమే శనివారం సాయంత్రం నగరంలోని రిలయన్స్ సెంట్రో వేదికగా ఆవిష్కృతమైంది. కవలల్లో దాగి ఉన్న ప్రతిభను, వారి మధ్య ఉండే ప్రత్యేక అనుబంధాన్ని ప్రోత్సహించేందుకు ‘ది ట్విన్స్ ఎడిట్’ పేరిట నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోకు విశేష స్పందన లభించింది.
చిన్నారుల నుంచి యువతీ యువకుల వరకు మొత్తం 15 జతల కవలలు ఈ పోటీలో పాల్గొని సందడి చేశారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ వారు చేసిన ర్యాంప్ వాక్, క్విజ్, ఇతర ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సెంట్రో ఎస్జీఎం వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. కవలల మధ్య ఉండే స్టైల్, ప్రత్యేక బంధాన్ని ఈ వేదిక ప్రతిబింబించిందన్నారు. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో శాన్వి–శైవి ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీరమ్య–శ్రీలిఖిత ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోటీలో పాల్గొన్న కవలలందరికీ గిఫ్ట్ హ్యాంపర్లు అందజేశారు.


