● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం అర్బన్: ‘‘మత్తు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోండి. మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ పి.జగదీష్తో కలిసి నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్కార్డ్) జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ‘ఈగల్ క్లబ్లు’ క్రీయాశీలకంగా పనిచేయాలన్నారు. పాఠశాలల సమీపంలో గుట్కా, గంజాయి, ఇతర నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై సమాచారం సేకరించి పంపించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఈగల్ క్లబ్కు ఒక మహిళ పోలీసు అధికారిని అనుసంధానం చేయాలన్నారు. ఆయా ఈగల్ క్లబ్లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బందితో నెలకోసారి పాఠశాలల్లో మాదకద్రవ్య వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ‘‘డ్రగ్స్ వద్దు బ్రో’’ పుస్తకాన్ని కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. సమావేశంలో ఏఎస్పీ నాగభూషణం, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీటీసీ వీర్రాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వలీబాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హెచ్ఐవీ నియంత్రణపై దృష్టి సారించాలి
హెచ్ఐవీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. తన చాంబర్లో వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. హెచ్ఐవీ ప్రభావిత ప్రాంతాలు, వర్గాలు, వృత్తిదారులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎయిడ్స్ నియంత్రణాధికారి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గడువులోపు ‘సర్’ పూర్తి చేస్తాం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను గడువులోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్యాదవ్కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. సీఈఓ గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు ఎస్పీ పి.జగదీష్, డీఆర్ఓ ఎ.మలోల పాల్గొన్నారు.
చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి
అనంతపురం న్యూటౌన్: జిల్లాలో బల్క్ చెత్త తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీ ఆవరణంలోని డీపీఆర్సీ మీటింగ్ హాలులో గురువారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బల్క్ వేస్ట్ జనరేటర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ే


