కణేకల్లు: మండలంలోని అంబాపురంలో గురువారం గంగమ్మ (28) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాలమేరకు.. బొమ్మనహళ్ మండలం హారేసముద్రానికి చెందిన హెచ్.వండ్రక్క, వండ్రప్పల కుమార్తె గంగమ్మను పదేళ్ల క్రితం అంబాపురానికి చెందిన వన్నూరుస్వామికిచ్చి వివాహాం చేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీరికి ముగ్గురు కుమారులున్నారు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం గురువారం ఉదయం వన్నూరుస్వామి తన భార్య ఉరి వేసుకొని చనిపోయినట్లు భార్య తరుపు బంధువులకు చెప్పాడు. వారి ద్వారా సమాచారం తెలుసుకొన్న గంగమ్మ తల్లిదండ్రులు గురువారం ఉదయం అంబాపురంలోని వారి ఇంటికెళ్లి విగతజీవిగా ఉన్న కూతుర్ని చూసి బోరుమన్నారు. అయితే గంగమ్మ తలకు దెబ్బలు తగలడంతో తమ కూతుర్ని కొట్టి చంపి ఉంటారని తల్లీదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా గంగమ్మ పెద్ద కుమారుడు ముని బుధవారం రాత్రి ఇంట్లో జరిగిందంతా పోలీసులకు వివరించినట్లు సమాచారం.
ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా నారాయణస్వామి
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్తగా (ప్రిన్సిపాల్ సైంటిస్ట్, హెడ్) గురువారం డాక్టర్ నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ విజయ శంకర్బాబు వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల తిరుపతి–మృతికా శాస్త్ర విభాగ అధిపతిగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లా రైతులకు పంటల సాగులో లాభసాటి మెళకువలు అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణపై వ్యవసాయ సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. రైతాంగ అభివృద్ధికి పరిశోధనా స్థానం తరుఫున ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.
వ్యక్తిపై పోక్సో కేసు
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని పసులూరులో బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేఽధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి వివరాలమేరకు.. వెంకటాపురానికి చెందిన రాజు పసులూరు గ్రామంలో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. రాజుకు ఇది వరకే పెళ్లి అయింది. అయితే నాలుగు రోజుల క్రితం బాలికను రాజు ఇంటి నుంచి తీసుకెళ్లాడు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఇరువురిని స్టేషన్కు తీసుకొచ్చి రాజును అదుపులోకి తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. రాజుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


